సంసారన్నయినా వదులుకుంది కానీ... ధనుష్‌ను వదల్లేదు... అమలా పాల్ వ్యవహారం...

శుక్రవారం, 29 జులై 2016 (12:20 IST)
ఇద్దరమ్మాయిలతో చిత్రంతో తెలుగులో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అమలాపాల్. తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా వరుస సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లింది. అయితే కెరీర్ ఊపు మీద ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. సంసారం సజావుగా సాగుతున్న సమయంలో అమలాపాల్ తన భర్త విజయ్‌తో విడాకులు తీసుకున్నదనే వార్త కోలీవుడ్‌లో గుప్పుమంటున్నాయి. 
 
గత కొద్ది కాలంగా వీరిద్దరి విడాకులకు సంబంధించి కొన్ని పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఈ విషయంపై విజయ్ తండ్రి ఏ.ఎల్ అళగప్పన్ స్పందిస్తూ... విజయ్, అమలాపాల్ విడిపోయారని అధికారికంగా ప్రకటించారు. విజయ్ కూడా ఇటీవలే జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అమలాపాల్ ప్రస్తావన అనవసరమని చెప్పుకొచ్చాడు.
 
విజయ్, అమలాపాల్ 2014 జూన్ 12న ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అసలు ప్రేమించుకోవడానికి కారణం విజయ్ దర్శకత్వంలో వచ్చిన ''దైవ తిరుమగళ్'' అనే చిత్రం. ఆ సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే తర్వాత ఆమె పెళ్ళిచేసుకోవడం అంతా బాగానే ఉన్నా ఇప్పుడు మాత్రం వీరిద్దరు విడిపోవడానికి కారణం మాత్రం ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ''వడచెన్నై'' చిత్రమని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
 
విజయ్‌కి నచ్చకపోయినా కూడా ఆ తమిళ సినిమాలో అమలాపాల్ నటిస్తుండడమే దీనికి ముఖ్య కారణమని అంటున్నారు. తన విడాకుల విషయమై అమలాపాల్ త్వరలోనే ప్రకటన చేయవచ్చని కోలీవుడ్ వాసులు అంటున్నారు. అంతేకాదు.. చూడచక్కగా ఉండే ఈ జంట విడిపోవడం అవసరమా అంటూ ఫ్యాన్స్ అంటున్నారు. సినిమాల్లో నటించవద్దని భర్త చెప్తే.. అమలాపాల్ ప్రేమ కోసం వాటిని పక్కనబెట్టి విజయ్‌తో కలిసి వుండొచ్చు కదా అంటున్నారు. మరి అమలా పాల్ ఏం చేస్తుందో ఏమో వేచి చూడాలి మరి. 

వెబ్దునియా పై చదవండి