ఆ మాటలకు పదింతల మర్యాద లభించింది... విజయశాంతి

బుధవారం, 8 జనవరి 2020 (18:09 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో లేడీ అమితాబ్‌గా పేరుగాంచిన సీనియర్ హీరోయిన్ విజయశాంతి. వెండితెరకు దూరమై 15 యేళ్లు అయింది. ఇపుడు ప్రిన్స్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "సరిలేరు నీకెవ్వరు" చిత్రంలో నటించారు. ఈ చిత్రం ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈపరిస్థితుల్లో ఇటీవల ఈ చిత్ర ప్రిరిలీజ్ వేడుక జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా చిరంజీవి పాల్గొని, తన హీరోయిన్ విజయశాంతి అంటూ ఆకాశానికెత్తేశారు. 
 
చిరంజీవి పొగడ్తలపై విజయశాంతి తన ఫేస్‌బుక్ ఖాతాలో స్పందించారు. నటనాపరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే... కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం. 
 
జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో... నటనకు డిక్షనరీ వంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను 'గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక' అని సంబోధించినపుడు ఎంతో గౌవరంగా భావించాను. 
 
అదేవిధంగా కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా... లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ వంటి అభినందనలు పొందినా... ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను. 
 
నిజానికి ఒక సినిమాలో నటించిన తర్వాత, అది విడుదలైన తర్వాత వచ్చే ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేష్ బాబుకు కృతజ్ఞతలు. "సరిలేరు నీకెవ్వరు" దర్శకుడు రావిపూడితోపాటు... మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు