"ఒక మనసు".. అనే పేరుతో సినిమా ప్రకటించడం. అందులో నాగబాబు కుమార్తె నిహారిక నటిస్తుంది అనగానే.. సినిమాకు క్రేజ్ వచ్చింది. మెగా కుటుంబంలోంచి హీరోయిన్ వస్తుంది. తను ఎలా చేస్తుందనే ఇంట్రెస్ట్ అందరికీ కలిగింది. దానికితోడు 'మల్లెల తీరంలో సిరిమల్లెచెట్టు'.. అనే క్యూట్ లవ్ స్టోరీ తెరకెక్కించిన రామరాజు దర్శకత్వంలో రావడం... దీనికి మధుర శ్రీధర్తో పాటు టీవీ9 ఛానల్ కూడా ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ కావడం మరింత క్రేజ్ తెచ్చింది. మరి ఆక్రేజ్ ఎంతవరకు వర్కవుట్ అయిందో చూద్దాం.
కథ:
సూర్య (నాగశౌర్య) విజయనగరంలో తండ్రి రావు రమేష్ అండతో సెటిల్మెంట్లు, దందాలు చేస్తుంటాడు. మెడిసిన్ చేసి ప్రాక్టీస్గా అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి సంధ్య (నిహారిక) వస్తుంది. ఫస్ట్లుక్తోనే ఎక్కడో చూసినట్లుందనే ఫీలింగ్తో సూర్యకు దగ్గరవుతుంది. ఫిలాసఫికల్గా ఇలాంటి ఫీలింగ్స్.. పూర్వజన్మలో పరిచయాలనుబట్టి వస్తుంటాయని.. అమ్మ చెప్పింది గాఢంగా నమ్మేస్తుంది. సూర్యను మరింత గాఢంగా ప్రేమిస్తుంది. సూర్య ఓ కేసులో జైలుకు వెళ్ళినా.. తను మర్చిపోకుండా.. అతన్నే పెండ్లి చేసుకోవాలనుకుంటుంది.
సూర్యకు ఆ కేసు వల్ల ఆస్తినంతా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అయినా సంధ్య మనస్సులో నువ్వు తప్ప వేరొకరిని ఊహించుకోనని.. అతనితో కొద్దిరోజులు గడుపుతుంది. ఆ సమయంలో మేనమామ పొలిటీకల్ లీడర్ అయిన నాగినీడు తన కుమార్తెనిచ్చి సూర్యను అల్లుడు చేసుకోవాలని భావిస్తాడు. దీంతో ఎం.ఎల్.ఎ. అవ్వాలనే తండ్రి కోరిక, అప్పులు కూడా తీరిపోతాయని నిర్ణయానికి వచ్చి ఆ విషయం సంధ్యకు ఎలా చెప్పాలో తర్జనభర్జనలు పడుతూ.. కేసురీత్యా మల్ళీ జైలుకు వెళుతున్నాననీ.. తనను మర్చిపోమని చెబుతాడు. ఆ తర్వాత కథ ఏమిటి? అనేది సినిమా.
పెర్ఫార్మెన్స్:
నటనాపరంగా నీహారిక కొత్త అమ్మాయి కాబట్టి.. పాత్ర మేరకు తను సింపుల్గా చేసేసింది. ఒకరకంగా పాత్రలో ఒదిగిపోయింది. నటుడిగా తనేంటో ప్రూవ్ చేసుకున్న నాగశౌర్య.. ఈసారి స్టైలిష్పాత్రలో నటించాడు. చూడ్డానికి అందంగా కన్పించడం.. అందం గురించే హీరోయిన్ మెచ్చుకోవడం.. ఈ చిత్రంలో స్పెషాలిటీ. రావుర మేష్ పాత్ర సగటు రాజకీయ నాయకుడిగా బాగా చేశాడు. నాగినీడు ఇతర పాత్రలు ఓకే. వెన్నెల కిషోర్ సంధ్యను చేసుకునేవాడిగా రెండు సీన్లులో కన్పిస్తాడు. ఆ కాసేపు నవ్విస్తాడు.
టెక్నికల్గా...
కెమెరా పనితనం బాగుంది. ముఖ్యంగా గ్రామీణ అందాలు, సముద్రతీరం అంతా ఆహ్లాదకరకంగా వుంది. సంగీతపరంగా సునీల్ కశ్యప్ ఫీల్గుడ్ లవ్స్టోరీకి ఇవ్వాల్సిన బాణీలు ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ సాహిత్యం బాగున్నా.. గుర్తించుకునేట్లుగా అనిపించవు. సంభాషణలపరంగా దర్శకుడు రామరాజు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎక్కడా ఎటువంటి ప్రాసలకు ప్రాకులాడకుండా.. ద్వందార్థాలు లేకుండా రాసుకున్నాడు. ఇతర డిపార్ట్మెంట్లు బాగానే పనిచేశాయి.
విశ్లేషణ:
ప్రేమకథలు నవలలుగా రాసినప్పుడు అది చదివే ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. కానీ తెరపై ఎక్కించే క్రమంలో ఆస్వాదించాలంటే ఓపిగ్గా కూర్చోవాలి. ముఖ్యంగా ఫీల్గుడ్ మూవీస్కు ఆ ఓపిక ఉండాలి. "మరోచరిత్ర" వంటి సినిమాలతో దర్శకుడు పోల్చిన.. అందులో కథాగమనంలో ఇతర పాత్రలతోపాటు వారు మాట్లాడే భాష.. మధ్యమధ్యలో కొన్ని సన్నివేశాలు ఎంటర్టైన్ చేయిస్తాయి. కానీ ఒక మనసులో అదే లోపించింది. సినిమా అంతా సీరియస్గానే సాగుతుంది. వర్మ చిత్రాల్లోని సీరియస్ అంతా ఇందులో కన్పిస్తుంది. అది ఫ్యాక్షన్ హత్యలైతే.. ఇందులో ప్రేమకోసం దాన్ని దక్కించుకోవడం కోసం హీరోహీరోయిన్లు చేసిన సీరియస్ యాక్షన్. ఇద్దరి కెమిస్ట్రీ ఎక్కడా చెడిపోకుండా జాగ్రత్త చేశారు.
దర్శకుడికి రామకృష్ణ పరమహంస ఫిలాసిఫీ అంటే ఇష్టం. తన చిత్రాల్లో ముందు పాయింట్ అదే కన్పిస్తుంది. రాజులు, రాజ్యాలు, ఈ దేహం పోయినా.. ప్రేమ ఎప్పటికీ నిలిచిపోతుంది. గుండెలో దాచుకునేట్లుగా ఉంటుంది. ఈ పాయింట్తోనే దర్శకుడు తను రాసుకున్న కథ. ప్రేమకథలు తీయడం కొత్తకాదు. ఇలా స్లో నెరేషన్తో.. హీరోహీరోయిన్లను చివరివరకు చూడ్డం ఒకరకంగా ఇప్పటితరానికి పరీక్షే. ప్రేమలో పడినవారికి ఆ ప్రేమ రుచి ఏమిటో ఈ చిత్రంతో ఒక్కసారి చూసినట్లుంటుంది.
రాజకీయంగా ఎదగాలంటే.. కులాన్ని అడ్డుపెట్టుకోవాలి.. కానీ ఆ కులం కూడా.. డబ్బుతో ముడిపడివుంటుంది. అది లేనివాడు, అప్పటివరకు వెనకాలే ఉన్నవారంతా.. దూరమవుతారు. ఈ నీతిని ఇందులో దర్శకుడు చక్కగా చెప్పాడు. అలాగే గత జన్మలో తీరని కోర్కెలు కారణంగా పుట్టినవారు, అది తీరగానే తనువు చాలిస్తారు. మరు జన్మలో మరలా దాన్ని సాధించుకున్నామనే.. కర్మ సిద్ధాంతాన్ని హీరోయిన్ పాత్రలో చూపించాడు. చక్కటి ప్రేమకథ అయినా.. దాన్ని ఆస్వాదించాలంటే.. ముగింపు వరకు ఓపిగ్గా ఉండాల్సిందే. ఏదిఏమైనా.. మెగా ఫ్యామిలీ నుంచి అమ్మాయి.. చక్కటి పాత్ర చేసిందనే గుర్తింపు వస్తుంది.