భక్తులారా... శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరండి...

సోమవారం, 30 సెప్టెంబరు 2019 (21:02 IST)
బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవానికి సర్వం సిద్ధమైంది. నిన్న అంకురార్పణ జరుగగా సాయంత్రం ధ్వజారోహణ ఘట్టం జరిగింది. తొమ్మిదిరోజుల పాటు జరిగే సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు టిటిడి సిద్థమైంది. అక్టోబర్ 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.
 
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవమంటే ఒక పెద్ద పండుగే. తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు అశేషంగా తరలిరానున్నారు. ఈ రోజు రాత్రి పెద్ద శేషవాహనంలో స్వామివారు ఊరేగనున్నారు. అలాగే తొమ్మిదిరోజుల పాటు ఉదయం ఒక వాహనంపై, రాత్రి మరో వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్సనమివ్వనున్నారు.
 
అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు చిన్నశేషవాహన సేవ, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు హంసవాహనం, 2వతేదీ ఉదయం సింహవాహనం, రాత్రి ముత్యపు పందిరివాహనం, 3వతేదీ ఉదయం కల్పవ్రుక్షవాహనం, రాత్రి సర్వభూపాల వాహనం, 4వతేదీ ఉదయం మోహినీ అవతారం, రాత్రి 7గంటలకు గరుడవాహనం, 5వతేదీ ఉదయం హనుమంతవాహనం, రాత్రి గజవాహనం, 6వతేదీ ఉదయం సూర్యప్రభవాహనం, రాత్రి చంద్రప్రభవాహనం, 7వతేదీ ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహన, 8వతేదీ ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 
బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. 5 వేల మంది పోలీసులు బందోబస్తులో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో ఇప్పటికే ఆలయాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. ఫల, పుష్పప్రదర్సనలను ఏర్పాటు చేశారు. భక్తులను మరింత ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తోంది టిటిడి. అశేషంగా తరలివచ్చే భక్తుల కోసం టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు