గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాదులో ఎయిరిండియాకు చెందిన విమానం రన్ వే పైనుంచి టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లేందుకు టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కాగా ఈ విమాన ప్రమాదానికి ముందు విమానంలో ప్రయాణించబోయే ప్రయాణికులు తీసుకున్న సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతదేశ పర్యటనకు వచ్చి ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలను తమ వెంట తీసుకు వెళ్తున్న బ్రిటీష్ పౌరులు Good Bye India, మళ్లీ తిరిగి వస్తాము అంటూ ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కనబడుతోంది.
అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ మహా విషాదం గురువారం మధ్యాహ్నం 1.43 గంటల సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే, ఈ ప్రమాదానికి కారణం.. విమానాన్ని ఓ పక్షి ఢీకొనడం వల్లే జరిగివుంటుందని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై నిపుణులు స్పందిస్తూ, టేకాఫ్ సమయంలో విమానానికి పక్షి ఢీకొనివుండొచ్చని, దాని కారణంగానే విమానం టేకాఫ్కు అవసరమైన వేగాన్ని ఎత్తును అందుకోలేక ప్రమాదానికి దారితీసివుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
విమానరంగ నిపుణుడు, మాజీ సీనియర్ పైలెట్ కెప్టెన్ సౌరభ్ భట్నాగర్ స్పందిస్తూ, ప్రాథమికంగా చూస్తే ఇది కొన్ని పక్షుల ఢీకొన్న ఘటనలా కనిపిస్తోంది. దీనవల్ల రెండు ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండొచ్చు. టేకాఫ్ సజావుగానే జరిగింది. అయితే, గేర్లను పైకి తీసుకొచ్చే లోపే విమానం కిందికి దిగడం ప్రారంభించింది. ఇంజన్లు శక్తిని కోల్పోయినపుడు లేదా విమానం పైకి లేచే శక్తిని కోల్పోయినపుడు మాత్రమే ఇలా జరుగుతుంది. అసలు కారణం దర్యాప్తులో తేలుతుంది" అని అన్నారు.