నీ అదృష్టం బాగుండీ మంత్రివయ్యావు.. మంత్రి ఆదిపై ఎమ్మెల్యే ఫైర్

ఆదివారం, 6 మే 2018 (12:40 IST)
ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు మండిపడ్డారు. తనకు తెలియకుండా తన నియోజకవర్గ పరిధిలోని పోరుమామిళ్లలో మంత్రి ఆదినారాయణరెడ్డి ఏ విధంగా బైక్ ర్యాలీ నిర్వహిస్తారంటూ ఆయన నిలదీశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తానూ ఆదినారాయణ రెడ్డి ఇద్దరమూ జంప్ జిలానీలమేనని, వైసీపీలో గెలిచి టీడీపీలోకి వచ్చామని గుర్తుచేసిన ఆయన, అదృష్టం బాగుండి ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యారని, తాను కాలేదని గుర్తుచేశారు. డబ్బు సంపాదనకే రాజకీయాల్లోకి ఆది వచ్చారని, తాను ప్రజా సేవ చేసేందుకు వచ్చానన్నారు. 
 
ఆయన నియోజకవర్గానికి చెప్పకుండా తాను వెళ్లి ర్యాలీలు నిర్వహిస్తే ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమాలకు కూడా తనను పిలవడం లేదని అసంతృప్తిని వ్యక్తంచేశారు. తాను కలసి పోదామని భావిస్తున్నా ఇన్‌చార్జ్ విజయమ్మ వినడం లేదని, బద్వేల్‌లో అందరమూ కలసి ఒకేచోట దీక్ష చేద్దామంటే వినకుండా వేర్వేరు శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. 
 
దీనికంతటికీ కారణం తాను దళితుడినని తనపై చిన్నచూపు చూస్తున్నారని, ఎస్సీలకు రిజర్వ్ అయిన నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నించారు. చేతనైతే ఇతర నియోజకవర్గాలకు వెళ్లి ఇలాగే ఆధిపత్యం చెలాయించాలని జయరాములు సవాల్ విసిరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు