మీకు అందమైన పసికందు కావాలా..? ఆరోగ్యంగా వుండాలా?

శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (11:51 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో పసికందుల విక్రయం హాట్ టాపిక్ అయ్యింది. 30 సంవత్సరాల నుంచి ఓ రిటైర్డ్ నర్సు చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. రిటైర్డ్ నర్సు ప్రధాన సూత్రధారిగా వెలుగులోకి వచ్చిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దేవుడి దయవల్ల 30 సంవత్సరాలలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని.. పిల్లల విక్రయంలో సమస్యలేమీ లేవని ఆమె మాట్లాడిన తీరు ప్రకంపనలు సృష్టిస్తోంది. 
 
పసికందుల విక్రయం దందా.. 30 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుందని.. మీకు అందమైన పసికందు కావాలా..? ఆరోగ్యవంతమైన పసికందు కావాలా..? అని ఆ నర్సు ఆ ఆడియోలో అడుగుతోంది. అందుకు పసికందును కొనుగోలు చేసే వ్యక్తి.. అందంగా వుంటే మంచిదని.. ఆరోగ్యంగానూ పసిబిడ్డ వుండాలని కోరడం స్పష్టంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. ఈ పసికందుల విక్రయానికి సంబంధించిన దందా బ్రహ్మాండంగా నడుస్తుండటంతో.. ఇక డ్యూటీ ఎందుకని స్వచ్ఛంద పదవీ విరమణ చేసిందట. 30 ఏళ్లుగా పిల్లల్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
రూపం, రంగును బట్టి ఆడపిల్లలైతే 3 లక్షల రూపాయల వరకు.. మగపిల్లలైతే 4 లక్షల రూపాయల వరకు ధర ఫిక్స్ చేసింది. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్ వెలుగుచూసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పిల్లలను విక్రయించడంలో పెద్ద రాకెట్ ఉండొచ్చనే దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు.
 
తమిళనాడును కుదిపేసిన ఈ ఘటనతో స్టేట్ హెల్త్ సెక్రటరీ అలర్టయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆడియో క్లిప్ సంభాషణల ద్వారా రిటైర్డ్ నర్సు నమక్కల్‌ జిల్లా రాశిపురానికి చెందిన ఆముదగా గుర్తించారు. ఆమెతో పాటు భర్త రవిచంద్రన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై పోలీసులు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు