చంద్రబాబు అలా చేయకపోతే గ్రాఫ్ గోవిందా.. పవన్ వల్లే టీడీపీ అవిశ్వాసం: ఉండవల్లి

శనివారం, 17 మార్చి 2018 (13:17 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొన్ని సూచనలు చేశారు. సోమవారం అవిశ్వాసం పెట్టేందుకు టీడీపీ సిద్ధమవుతున్న తరుణంలో ఉండవల్లి మాట్లాడుతూ.. కేంద్రంపై టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం ఏపీ రాజకీయాల్లోకి మంచి పరిణామమని చెప్పారు. అవిశ్వాసం చంద్రబాబుకు పెద్ద పరీక్ష అని.. ఆయన పట్టుదలగా వ్యవహరిస్తే.. అవిశ్వాసంపై చర్చ సాధ్యమేనని తెలిపారు. కానీ పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరగకపోతే.. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుందని హెచ్చరించారు. 
 
కాబట్టి చంద్రబాబు తనకున్న ఇమేజ్‌ను ఉపయోగించుకునేందుకు ఇది సరైన సమయమని గుర్తించాలన్నారు. అవిశ్వాసానికి రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల కోసం ఉపయోగించాలన్నారు. వాస్తవానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని చెప్పారు. బీజేపీ పవన్ కుమ్మక్కయ్యారనేది అవాస్తవమని తెలిపారు. ప్రత్యేక హోదా కోసం పవన్ నిరాహారదీక్ష చేపడితే మంచి ప్రచారం వస్తుందని ఉండవల్లి చెప్పుకొచ్చారు. 
 
మరోవైపు అవిశ్వాసంపై ఏపీ సీఎం చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. ఎంపీలంతా రెండు రోజులు ఢిల్లీలోనే వుండాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడే వుండి అవిశ్వాలానికి అందరి మద్దతు కూడగట్టాలని చెప్పారు. అన్నీ పార్టీల నేతలను వ్యక్తిగతంగా కలవాలని సూచించారు. మూడు పార్టీల మహా కుట్రను ప్రజల ముందు బయటపెట్టామని బీజేపీ, వైసీపీ, జనసేనలను ఉద్దేశించి అన్నారు. ఇంకా అవిశ్వాసంపై ఓటింగ్‌కు పట్టుబట్టాలని దిశానిర్దేశం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు