#DKShivakumararrested బీజేపీ ప్రతీకార, కక్ష సాధింపు రాజకీయాల బాధితుడిని...

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (10:00 IST)
కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. నాలుగు రోజుల విచారణ తర్వాత ఆయన్ను ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. హవాలా లావాదేవీల నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. 
 
ఈ కేసులో శివకుమార్‌ను తమ కస్టడీలోకి తీసుకుని విచారించాల్సి ఉన్నందున అరెస్టు చేశామని, బుధవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి తమ కస్టడీకి అప్పగించాలని కోరుతామని ఈడీ అధికారులు తెలిపారు. కాగా, ఈ అరెస్టుపై డీకే శివకుమార్ స్పందించారు. తనను అరెస్ట్‌ చేయాలన్న లక్ష్యాన్ని విజయవంతం చేసుకున్న తన 'బీజేపీ మిత్రులను' అభినందిస్తున్నానని ట్వీట్‌ చేశారు. 
 
'నాకు వ్యతిరేకంగా ఐటీ, ఈడీ నమోదు చేసిన కేసులు రాజకీయ ప్రేరేపితం. నేను బీజేపీ ప్రతీకార, కక్ష సాధింపు రాజకీయాల బాధితుడ్ని. నాకు దేవుడిపై, న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. కక్ష సాధింపు చర్యలపై విజయం సాధించి బయటకు వస్తా' అని ధీమా వ్యక్తం చేశారు. 
 
కాగా, శివకుమార్‌తోపాటు ఢిల్లీలోని కర్ణాటక భవన్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్న హనుమంతయ్య తదితరులపై గతేడాది సెప్టెంబర్‌లో ఈడీ కేసు నమోదుచేసింది. పన్ను ఎగవేత, కోట్ల రూపాయల హవాలా లావాదేవీలపై ఐటీ శాఖ గతేడాది బెంగళూరులోని ప్రత్యేక కోర్టులో కేసు నమోదు చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు