తిరుమలలో తిరునామం పెడతాడు, అతడి ఇంట్లో నోట్ల కట్టలే కట్టలు, ఎంతో తెలుసా?

మంగళవారం, 18 మే 2021 (19:52 IST)
తిరుమలలో అతను తిరుమల శ్రీవారి తిరునామానికి కేరాఫ్ అడ్రెస్. విఐపిలు వచ్చినప్పుడు వారికి నామాలు (నుదుటికి తిరునామం) పెట్టడం వారి ఇచ్చిన డబ్బులు తీసుకోవడం చేసేవాడు. సాధారణ వ్యక్తిలా ఉండే అతని ఇంట్లో ఉన్నట్లుండి లక్షల రూపాయలు కంట కనిపించాయి. నోట్ల కట్టలను లెక్కేయడానికి ఒకరోజుంతా పట్టింది. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..
 
తిరుమల బాలాజీనగర్‌లో గతంలో నివాసముండేవారు శ్రీనివాసాచారి. వారి తాత, ముత్తాల కాలం నుంచి వారికి ఇల్లు ఉండేది. దీంతో కొంతమంది నిర్వాసితులను కిందకు దించింది టిటిడి. అందులో శ్రీనివాసాచారి కూడా ఉన్నాడు. తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో శేషాచల నగర్ అనే ప్రాంతంలో టిటిడి శ్రీనివాసాచారికి ఇల్లు ఇచ్చింది.
 
శ్రీనివాసాచారి తిరుమలలో విఐపిలకు నామాలు పెట్టడం.. వారు ఇచ్చిన డబ్బులు తీసుకునేవాడు. తిరుమలలో ఇలా డబ్బులు బాగా సంపాదించాడు. సంపాదించిన డబ్బులు మొత్తాన్ని తిరుపతి శేషాచలనగర్ లోని తన ఇంటిలో ఉంచాడు. 500 రూపాయలు, 100 రూపాయలు, 2 వేల రూపాయలు, 10 రూపాలు, 50 రూపాయలు, 20 రూపాయల నోట్లు ఇలా కట్టలు కట్టి ఇంట్లో పడేశాడు.
 
స్వతహాగా శ్రీనివాసాచారి పిసినారి కావడంతో డబ్బులను బాగా కూడబెట్టాడని స్థానికులు చెబుతున్నారు. తల్లిదండ్రులు చనిపోవడంతో శ్రీనివాసాచారి ఒక్కడే ఉంటున్నాడు. అయితే గత సంవత్సరం కరోనాతో తిరుమలలోనే శ్రీనివాసాచారి కన్ను మూశాడు. శ్రీనివాసాచారికి ఎవరూ లేకపోవడంతో టిటిడి తిరుపతిలోని ఇంటిని జప్తు చేయాలని నిన్న విజిలెన్స్ సిబ్బంది వెళ్ళారు.
 
అయితే ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళితే లక్షల రూపాయలు గుట్టలు గుట్టలుగా కనిపించాయి. గోతాములు, అట్టబ్యాక్సులు, లడ్డూ కవర్లు, షెల్ఫ్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ డబ్బులు కనిపించాయి. దీంతో టిటిడి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన విజిలెన్స్ సిబ్బంది ఆ డబ్బును లెక్కించడం మొదలుపెట్టారు. 
 
ఒకరోజు లెక్కించి సుమారుగా 10 లక్షలుగా ఉంటుందని ప్రకటించారు. శ్రీనివాసాచారి ఇంటి పక్కన వ్యక్తులే ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంట్లో మొత్తం చిందరవందరగా ఉంటే ఆ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో డబ్బులను చేర్చడం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు