నిమ్మగడ్డ పిటిషన్‌ను నేను విచారించలేను: హైకోర్టు న్యాయమూర్తి

శనివారం, 20 మార్చి 2021 (17:30 IST)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖలు లీక్ అవుతున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న విషయం విదితమే. ఈ వ్యవహారంపై హైకోర్టులో నిమ్మగడ్డ ‌పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. పిటిషన్‌లో పలు విషయాలు రమేష్ ప్రస్తావించారు. తాను గవర్నర్‌తో జరిపిన ఉత్తర, ప్రత్యుత్తరాలన్నీ బయటికి లీకవుతున్న విషయంపై నిజానిజాలేంటో తేల్చాలని పిటిషన్‌లో నిమ్మగడ్డ పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ అంశాలన్నింటిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎస్ఈసీ పిటిషన్ వేయడం జరిగింది.
 
ఎలా లీకవుతున్నాయ్: ‘నేను గవర్నర్‌కు రాస్తున్న లేఖలు పబ్లిక్ కాదు.. ప్రివిలేజ్ లెటర్స్.. అవి ఎలా బయటికి వస్తున్నాయనేది విచారణ చేయాలి. నేను సెలవు పెడుతోన్న విషయాలు సైతం ఎలా బయటికి లీవుతున్నాయి?. నేను గవర్నర్‌కు రాసిన లేఖలు సోషల్ మీడియాలో చూశామని మంత్రులు చెప్తున్నారు. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ సీఎస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ప్రతివాదులుగా చేరుస్తున్నాను’ అని పిటిషన్‌లో నిమ్మగడ్డ పేర్కొన్నారు.
 
నేను విచారణ చేయలేను: ఇదిలా ఉంటే.. ఈ కేసు విచారణ సందర్భంగా ‘నాట్ బీ ఫోర్ మి’ అని హైకోర్ట్ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చీఫ్ జస్టీస్ దృష్టికి తీసుకెళ్లి ఈ పిటిషన్‌ను వేరే బెంచ్‌కి వేయాలని హైకోర్ట్ న్యాయమూర్తి సూచించారు. దీంతో ఇవాళ ఎటువంటి విచారణ జరగలేదు. చీఫ్ జస్టిస్.. హైకోర్ట్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ కేసును ఏ బెంచ్ తీసుకుంటుంది..? తీసుకున్న తర్వాత ఎలా ముందుకెళ్తుంది..? అనే దానిపై అందరిలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
 
ఇదిలా ఉంటే.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించేలా ఎస్ఈసీని ఆదేశించాలని హైకోర్ట్‌లో పిటిషన్‌ దాఖలైన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తిచేశామని ఎస్ఈసీ కోర్టుకు తెలిపింది. పరిషత్ ఎన్నికల నిర్వహణ ఎస్ఈసీ దృష్టిలో ఉందని, ఇప్పుడే దీనిపై కోర్టులో పిటిషన్ వేయటం ప్రి మెచ్యూఆర్ అని ఎస్ఈసీ తెలిపింది. అయితే.. దీనిపై తీర్పును హైకోర్ట్ న్యాయమూర్తి రిజర్వ్‌‌లో ఉంచినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు