జ‌గ‌న్ మార్కు పందేరం, ఓడిన వారికి, టిక్కెట్ మిస్ అయిన వారికి...

మంగళవారం, 13 జులై 2021 (17:32 IST)
ఏపీలో నామినేటెడ్ ప‌ద‌వుల పందేరంలోనూ సీఎం జ‌గ‌న్ త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శించారు. వైసీపీ జెండా కోసం శ్ర‌మించిన వారికి, టిక్కెట్లు ఆఖ‌రి నిమిషంలో మిస్అయిన వారికి, ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవులు ప్రకటనకు రంగం సిద్దమైంది. పదవుల కేటాయింపు పూర్తయింది. ఆఖ‌రి జాబితాను  ముఖ్యమంత్రి అంగీక‌రిస్తూనే, కొన్ని కీలక సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో, వాటిని అమలు చేస్తూ ఈ రాత్రికి లేదా రేపు నామినేటెడ్ పోస్టులను ప్రకటించటం ఖాయంగా కనిపిస్తోంది.            
 
రానున్న మంత్రివర్గ విస్తరణ, స్థానిక సంస్థల కోటాలో ఎనిమిది, ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయాల్సిన మూడు స్థానాల పైన ఒక అంచనాకు వచ్చిన తరువాతనే ఈ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఓడిన నేతలకూ పోస్టులు ఇస్తూ, జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. పార్టీ కోసం తొలి నుండి పని చేస్తున్న ద్వితీయ శ్రేణి నేతలకు జిల్లా స్థాయి పదవుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్ పాలసీగా నిర్ణయించిన విధంగా సామాజిక సమీకరణాలను పక్కగా అమలు చేస్తున్నారు.

ఇక రాష్ట్ర స్థాయిలో ఆర్టీసీ, మైనింగ్ కార్పోరేషన్, సివిల్ సప్లయిస్ కార్పోరేషన్, పోలీసు హౌసింగ్ కార్పోరేషన్ వంటి 32 పోస్టుల పైన పేర్లు దాదాపుగా ఖ‌రారు అయినట్లుగా తెలుస్తోంది.  రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులో ప్రధానంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓడిపోయిన వారికి ప్రాధాన్యం  ఇస్తున్నారు.  అందులో కొందరికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. వారిలో ఇంకా పదవులు ఇవ్వలేకపోయిన వారికి రాష్ట్ర స్థాయి పోస్టులు ఇవ్వబోతున్నారు. 
 
అందులో ప్రధానంగా ఆమంచి క్రిష్ణమోహన్, ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి, తోట వాణి, రౌతు సూర్యప్రకాశ రావు, దేవినేని అవినాశ్, బొప్పన భావన కుమార్, బాచిన చైతన్య వంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు పై పోటీ చేసిన మరణించిన చంద్రమౌళి కుమారుడికి సైతం రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 
 
 ఇప్పటికే రిజర్వేషన్ల వారీగా జిల్లా పరిషత్‌లు ఖరారు కావటంతో ఏ జిల్లాలో ఎవరు జెడ్పీ ఛైర్మన్ చేయాలనే అంశం పైనా సీఎం జగన్ క్లారిటీతో ఉన్నారు. హైకోర్టు జెడ్పీటీసీ- ఎంపీటీసీ ఎన్నికల రద్దు నిర్ణయం పైన డివిజన్ బెంచ్ స్టే ఇచ్చినా, తుది ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. ఆ తరువాతనే ఆ ఎన్నికల కొనసాగింపుగా ఓట్ల లెక్కింపు లేదా కొత్తగా ఎన్నికలు జరపటమా అనే అంశం పైన నిర్ణయం తీసుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు