మృతి తర్వాత కూడా కరుణానిధి విజయం.. మెరీనాలోనే అంత్యక్రియలు

బుధవారం, 8 ఆగస్టు 2018 (11:14 IST)
తమిళ రాజకీయ యోధుడు కరుణానిధి అంత్యక్రియలపై ఎట్టకేలకు వివాదం ముగిసింది. మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించడం కుదరదని ప్రభుత్వం వేసిన పిటీషన్‌ను మద్రాసు హైకోర్టు కొట్టిపారేసింది. మెరీనా బీచ్‌లోనే కరుణ అంత్యక్రియలు నిర్వహించేలా హైకోర్టు తీర్పునిచ్చింది. 18 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి అంత్యక్రియలు అన్నా మెమోరియల్ పక్కనే నిర్వహించేందుకు మద్రాసు హైకోర్టు అనుమతి ఇచ్చింది.
 
అంతకుముందు కరుణానిధి అంత్యక్రియలకు స్థల కేటాయింపు విషయంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నివాసంలో ఆసక్తికర వాదనలు జరిగాయి. ప్రభుత్వం చెప్తున్నట్లుగా గాంధీ మండపం వద్ద కరుణానిధికి అంత్యక్రియలను నిర్వహించడం గౌరవప్రదం కాదని డీఎంకే తరపు న్యాయవాదులు వాదించారు. ప్రభుత్వం తరపు న్యాయవాదులు మాట్లాడుతూ డీఎంకే రాజకీయ ఎజెండాతో వాదిస్తోందని ఆరోపించారు. 
 
మెరీనా బీచ్‌లో స్మారకాలను ఏర్పాటు చేయడంపై గతంలో దాఖలు చేసిన పిటిషన్లను ఉపసంహరించుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. దీనిపై డీఎంకే తరపు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తోందన్నారు. 
 
కరుణానిధికి రాజకీయ గురువు అయిన అన్నాదురై సమాధి పక్కనే అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలు నిర్వహించడానికి ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు