1946, డిసెంబరు 30 ప్రేమకథ.. అలా విడిపోయి.. ఇలా కలిశారు..

శనివారం, 29 డిశెంబరు 2018 (13:53 IST)
72ఏళ్ల తర్వాత ఓ ప్రేమ కలిసింది. 13 ఏళ్ల వయస్సులో విడిపోయిన ఈ ప్రేమ 72 ఏళ్ల తర్వాత ఒక్కటైంది. ప్రేమ పెళ్లి వరకు వచ్చినా.. పెళ్లైన ఎనిమిది నెలలకే ఆ జంట విడిపోవాల్సి వచ్చింది. చివరికి 72 ఏళ్ల తర్వాత కలిసింది. 1946లో జరిగిన ఈ ప్రేమకథ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన ఈకే నారాయణన్ నంబియార్‌‍కి 90ఏళ్ల వయస్సు. ఇదే రాష్ట్రానికి చెందిన శారద వయస్సు 86 ఏళ్లు. పెళ్లైన 8 మాసాలకే వీరు విడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కూడ వేర్వేరు వారిని వివాహం చేసుకున్నారు. 
 
1946, డిసెంబరు 30న తలియాన్‌, నారాయణ్ సహా 400 మంది కార్యకర్తలు భూస్వాముల ఇళ్లపై దాడి చేయడానికి వెళ్లారు. అయితే వారిపై మలబార్ ప్రత్యేక పోలీసులు కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో ఐదుగురు మరణించారు. అనంతరం తలియాన్, నారాయణన్‌‌తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. నారాయణన్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆపై జైలుకెళ్లిన నారాయణ్ 1954లో జైలు నుంచి విడుదలయ్యాడు.
 
ఇంతలో శారదకు పుట్టింటికి వెళ్లిపోవడం.. ఆమె తల్లిదండ్రులు ఆమెకు రెండో వివాహం చేసిపెట్టడం జరిగిపోయాయి. దీన్ని తెలుసుకున్న నారాయణన్ కూడా రెండో వివాహం చేసుకున్నారు. నారాయణన్ నంబియార్ జీవితంపై ఆయన మేనకోడలు శాంతా కవుంబాయి డిసెంబర్ 30 పేరుతో నవల రాశారు. ఈ నవల చదివిన శారద కుమారుడు వీరిద్దరిని కలుసుకొనే ఏర్పాటు చేశారు. వారిద్దరిని కలిపారు. ఈ సందర్భంగా రెండు కుటుంబాలు కేరళ సంప్రదాయంలో విందు ఏర్పాటు చేశారు. ఈ ప్రేమకథకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు