ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యే.. కానీ బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలి : సుప్రీంకోర్టు

శనివారం, 19 మే 2018 (11:25 IST)
కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను మార్చే ప్రసక్తే లేదనీ, ఆయనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప సర్కారు బలపరీక్షను సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అయితే, బలపరీక్షను అన్ని టీవీ చానెళ్ళలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ బీజేపీ‌కి చెందిన ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం పట్ల కాంగ్రెస్, జేడీఎస్‌లు నిరసన వ్యక్తం చేసి, గవర్నర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సుప్రీంను ఆశ్రయించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్వీ దేశ్‌పాండే‌ సీనియర్ అయినప్పటికీ.. గవర్నర్ మాత్రం బీజేపీ నేత అయిన బోపయ్య వైపే మొగ్గు చూపారని కాంగ్రెస్, జేడీఎస్‌లు ఆరోపించాయి. 
 
బోపయ్య నియామకంపై కపిల్ సిబల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. బోపయ్య ట్రాక్ రికార్డ్ సక్రమంగా లేదని సిబల్ బెంచ్‌కు విన్నవించారు. కర్ణాటక శాసనసభలో ప్రొటెం స్పీకర్ బోపయ్యతో సమస్యలు ఉత్పన్నమవుతాయని వివరించారు. 
 
ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార అంశం మంచి నిర్ణయం. కానీ ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య పర్యవేక్షణలో విశ్వాస పరీక్ష అభ్యంతరకరమని సిబల్ కోర్టుకు తెలిపారు. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యను విశ్వసించలేమన్నారు. ఆయన ఎంపికపై తమకు అభ్యంతరాలున్నాయని కోర్టుకు సిబల్ చెప్పారు. ఇందుకు బోపయ్య గత చరిత్రే కారణమని సిబల్ గుర్తు చేశారు. 
 
గవర్నర్ విచక్షణపై నబం రెబియా కేసులో తీర్పును సిబల్ ఉటంకించారు. సీనియర్ సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా లేని సందర్భాలు ఉన్నాయా? అని జస్టిస్ బాబ్డే.. సిబల్‌ను ప్రశ్నించారు. బోపయ్య వ్యవహారం సీనియారిటీకి సంబంధించినది మాత్రమే కాదు. బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా ఉన్నప్పుడు ఆపరేషన్ కమల ఉదంతాన్ని కపిల్ సిబల్ గుర్తు చేశారు. ఇరు వర్గాల వాదనలు ఆలకించిన కోర్టు.. కాంగ్రెస్, జేడీఎస్ పిటిషన‌ను కొట్టివేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు