సిద్ధూ ఇంట్లో పెంచిన చిలుకను కాదు : కుమారస్వామి

మంగళవారం, 24 సెప్టెంబరు 2019 (16:04 IST)
కర్నాటక మాజీ ముఖ్యమంత్రులు కుమార స్వామి, సిద్ధరామయ్యల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండిపోతోంది. కర్నాటకలో కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారు కూలిపోవడానికి ప్రధాన కారణం సిద్ధరామయ్యేనని కుమారస్వామి లోలోన కుమిలిపోతున్నారు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా, కర్ణాటకలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ఓటమికి రాష్ట్ర నాయకత్వం సరిగ్గా లేకపోవడమే కారణమని కుమారస్వామి చెప్పారు. 
 
ముఖ్యంగా, తాజాగా కుమార స్వామి మాట్లాడుతూ, "నేను సిద్ధరామయ్య ఇంట్లో పెంచిన చిలుకను కాదు. తాను కాంగ్రెస్‌ అధిష్టానం దయవల్ల కర్ణాటకకు ముఖ్యమంత్రిని అయ్యాను. సిద్ధరామయ్య దయ వల్ల సీఎంను అయ్యానని చెప్పడం హాస్యాస్పదంగా ఉంద"న్నారు. 
 
మాజీ ప్రధాని దేవేగౌడ వద్ద ఎంతో మంది కాలం వెల్లదీశారు. కాంగ్రెస్‌ అధిష్టానం చెప్పినట్లు విని ఉంటే రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం సుస్థిరంగా ఉండేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత ప్రాంతీయంగా కొంత శక్తిని ఏర్పర్చుకున్నాను. ప్రాంతీయంగా శక్తిని ఏర్పర్చుకునే దమ్ము సిద్ధరామయ్యకు ఉందా? అని కుమారస్వామి ప్రశ్నించారు. సిద్ధరామయ్యకు మద్దతుగా నిలిచేవారు ఎవరూ లేరని కుమారస్వామి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు