షణ్ముగం కాదు.. విక్రమ్ జాడను మేమే గుర్తించాం : ఇస్రో

బుధవారం, 4 డిశెంబరు 2019 (12:46 IST)
చంద్రుడు దక్షిణ ధృవాన్ని ఢీకొట్టి శకలాలుగా మారిన విక్రమ్ ల్యాండర్‌ను తొలుత గుర్తించింది తామేనని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె. శివన్ వెల్లడించారు. కావాలంటే ఈ విషయాన్ని ఇస్రో వెబ్ సైట్లో చూడొచ్చని తెలిపారు. అంతేగానీ, చెన్నై టెక్కీ షణ్ముగ సుబ్రమణియన్ కాదని ఆయన తేల్చిచెప్పారు. అలాగే, అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రకటనను కూడా ఆయన ఖండించారు. 
 
కాగా, గత యేడాది జూలై 22వ తేదీన ఇస్రో చంద్రుడి భూ ఉపరితలంపై ఉన్న ఖనిజాలు, నీటి జాడలు కనుక్కునేందుకు చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపైకి పంపించింది. 
 
ప్రయోగం అంతా సాఫీగా జరిగి 48 రోజులపాటు ప్రయాణించి, ఆర్బిటర్ ల్యాండర్‌ను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఆర్బిటర్ మెల్లగా దూరాన్ని తగ్గించుకుంటూ చంద్రుని ఉపరితలం వద్దకు వెళ్లింది. దీంతో సెప్టెంబరు 7వ తేదీన ల్యాండర్‌ను చంద్రుని ఉపరితలంపై దించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. అయితే, సాఫ్ట్ ల్యాండింగ్ దశలో కేవలం 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్ హార్డ్ లాండింగ్ జరిగి శకలాలుగా మారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో నాసా విడుదల చేసిన ఫోటోలను నిశితంగా విశ్లేషించిన చెన్నైకు చెందిన టెక్కీ షణ్ముగ సుబ్రమణియన్ విక్రమ్ ల్యాండర్ శకలాలను గుర్తించాడు. ఈ విషయాన్ని నాసా కూడా ధృవీకరించింది. పైగా, షణ్ముగ సుబ్రమణియన్ అనే భారతీయ ఔత్సాహిక శాస్త్రవేత్త సహకారంతో వీటి శకలాలను తాము గుర్తించగలిగామని నాసా తెలిపింది. 
 
ఈ ప్రకటను ఇస్రో ఖండించింది. వివరాలను ఇస్రో వెబ్ సైట్లో చూడాలని కోరారు. అయితే, నాసా ఉంచిన చిత్రాల్లో ముక్కలైన ల్యాండర్ చిత్రాలు స్పష్టంగా కనిపిస్తుండగా, ఇస్రో చిత్రాల్లో అటువంటిదేమీ లేదు. ల్యాండర్ ఢీకొట్టిన ప్రాంతాన్ని చిన్న చుక్కగా మాత్రమే చూపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు