ప్రభాస్ పెదనాన్నగారా? ఐతే ఏంటి మెట్లు ఎక్కి రమ్మనండి.. ఎవరు?

మంగళవారం, 8 అక్టోబరు 2019 (14:37 IST)
రెబల్ స్టార్ కృష్ణంరాజు అంటే తెలియనివారు ఎవరూ వుండరు. ఐతే అలాంటి నటుడుకి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. దుర్గమ్మకు కుంకుమార్చన చేసేందుకు సతీసమేతంగా కృష్ణంరాజు ఇంద్రకీలాద్రి పర్వతం వద్దకు చేరుకున్నారు. విఐపి దర్శనం ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామనుకున్నారు. కానీ ఆలయ సిబ్బంది ఆయనను పట్టించుకోలేదని సమాచారం. 
 
నటుడు కృష్ణంరాజు అని తెలిసినా, ఆయన గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారనీ తెలిసినా, ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెదనాన్న అని తెలిసినా దుర్గ గుడి సిబ్బంది మాత్రం ఎంతమాత్రం పట్టించుకోలేదట. దానితో కృష్ణంరాజు ఓ సాధారణ భక్తుని క్యూ లైన్లో నిలబడి మొత్తం 6 అంతస్తులు ఎక్కి వెళ్లి దుర్గమ్మను దర్శించుకుని కుంకుమార్చన చేశారట. 
 
ఐతే ఆయనకు మోకాళ్ల నొప్పులు సమస్య వున్నది, పైగా కాస్త అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతున్నారు. ఐనప్పటికీ సీనియర్ నటుడు కృష్ణం రాజును సిబ్బంది అనుమతించకపోవడంపై ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు కూడా తన ఆవేదనను తెలిపి అక్కడ నుంచి వెళ్లిపోయారట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు