జైట్లీ 'అలా' మార్చాడు.. మాల్యా లండన్ పారిపోయాడు.. బాంబు పేల్చిన స్వామి

గురువారం, 13 సెప్టెంబరు 2018 (16:30 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చేసిన వ్యాఖ్యలు ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీకి సంకటంగా మారింది. ఈ తరుణంలో బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మరో బాంబు పేల్చారు.
 
తాను లండన్ వెళ్లిపోతున్నానంటూ విజయ్ మాల్యా పార్లమెంటులో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి చెప్పిన విషయం 'తిరుగులేని వాస్తవమని' అని స్వామి వ్యాఖ్యానించారు. అంతేనా విజయ్ మాల్యాపై విడుదలైన లుక్‌అవుట్ నోటీసును 'బలహీనపర్చింది' కూడా అంతే నిజమని స్వామి బాంబు పేల్చారు. 
 
తాను లండన్ వెళ్లే ముందు రుణాల చెల్లింపుపై జైట్లీతో చర్చించానంటూ మాల్యా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న నేపథ్యంలో స్వామి గురువారం ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 
 
'మాల్యా పరారీ విషయంలో ఇప్పుడు మా వద్ద రెండు తిరగులేని వాస్తవాలు ఉన్నాయి. అందులో మొదటిది... 2015 అక్టోబర్ 24న జారీ అయిన లుక్ అవుట్ నోటీసును బలహీనం చేశారు. 'అడ్డుకోండి' అనే మాటను 'సమాచారం చెప్పండి' అని మార్చడం వల్ల... విజయ్ మాల్యా 54 లగేజీ బ్యాగులతో దర్జాగా వెళ్లిపోయేందుకు వీలైంది. 
 
ఇక రెండోది... తాను లండన్ వెళ్లిపోతున్నానంటూ విజయ్ మాల్యా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఆర్థికమంత్రికి చెప్పారు అంటూ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తక్షణం ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు