ఆదరణ ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలి: హరీశ్ రావు

శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (14:24 IST)
ప్రజల్లో ఆదరణ వున్నప్పుడే గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట నియోజకవర్గంలోని ఇబ్రహీంపూర్ గ్రామంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. తన పొలిటికల్ రిటైర్మెంట్‌పై కామెంట్స్ చేశారు.


ప్రజల ప్రేమ, అభిమానం చూస్తుంటే చాలా సంతోషంగా వుందని.. ఆదరణ వున్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవాలనుందని చెప్పారు. ఈ జన్మకు తనకు ఇది చాలని అన్నారు. అనంతరం కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
 
తెలంగాణ ఏర్పాటు విషయంలో గులాంనబీ ఆజాద్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. కేసీఆర్ ఆమరణ దీక్ష ఫలితంగానే తెలంగాణ ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. ప్రత్యేకరాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇవ్వలేదని ఆరోపించారు. ఢిల్లీ మెడల వంచి తెలంగాణను తెచ్చుకున్నామని... గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు.
 
తెలంగాణకు ప్రత్యేకహోదాపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న చంద్రబాబుతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం ఏమిటని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తాము హరీశ్‌రావుకు ఓటు వేస్తామని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
 
కాగా హరీశ్ రావు వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమైనాయి. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కింద తాను పనిచేసేందుకు సిద్ధమని హరీశ్ రావు ప్రకటించడం.. తన శాఖ పనులను తప్ప ఇతర విషయాలను పట్టించుకోకపోవడంతో హరీశ్ రావు రాజకీయాలకు బైబై చెప్పేయాలనుకుంటున్నారని టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో ప్రజల ఆదరణ వున్నప్పుడే రాజకీయ సన్యాసం పుచ్చుకోవాలనిపిస్తుందని హరీశ్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణ భవన్‌లో చర్చకు దారి తీసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు