కరోనా టీకాను పందిమాంసంతో తయారు చేస్తారా? నో అబ్జెక్షన్ అంటున్న ఇస్లామిక్ బాడీ

గురువారం, 24 డిశెంబరు 2020 (08:50 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేసేందుకు కొన్ని ఫార్మా కంపెనీలు వివిధ రకాలైన టీకాలను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని టీకాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ టీకాలు నూరు శాతం ప్రభావంతంగా పని చేయకపోయినప్పటికీ.. కరోనా వ్యాప్తిని కొంతమేరకు అడ్డుకుంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే బ్రిటన్, అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాల్లో ఈ టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే, ఇపుడో సందేహం ఉత్పన్నమైంది. ఈ టీకా తయారీలో పందిమాంసంతో తయారు చేసిన జెలాటిన్‌ను ఉపయోగిస్తారని వెల్లడైంది. ఈ విషయంపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఇస్లామిక్ సంస్థ యూఏఈ ఫత్వా కౌన్సిల్ కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
వ్యాక్సిన్‌లో పందిమాంసంతో తయారైన జెలాటిన్ ఉన్నప్పటికీ తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి తామేమీ అడ్డుచెప్పబోమని పేర్కొంది. ముస్లింలకు పందిమాంసం వాడకం నిషిద్ధమని ఇస్లాం చెబుతున్న నేపథ్యంలో యూఏఈ ఫత్వా కౌన్సిల్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 
ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరో ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో, పందిమాంసంపై ఇస్లాంలో ఉన్న నిషేధాజ్ఞలను కరోనా వ్యాక్సిన్ విషయంలో అమలు చేయలేమని ఫత్వా కౌన్సిల్ ఛైర్మన్ షేక్ అబ్దల్లా బిన్ బయ్యా తెలిపారు. మానవ దేహాన్ని పరిరక్షించుకోవడమే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యతాంశమన్నారు. 
 
పందిమాంసంతో చేసిన జెలాటిన్ ఓ ఆహార పదార్థం కాదు గనుక ఎలాంటి ఇబ్బంది లేదని, దీన్ని ఔషధంగానే భావిస్తామని ఫత్వా కౌన్సిల్ వివరించింది. కాగా, కరోనా వ్యాక్సిన్‌లోనే కాదు, ఇతర వ్యాధులకు ఉపయోగించే వ్యాక్సిన్లలోనూ పందిమాంసంతో తయారైన జెలాటిన్‌ను వినియోగిస్తారు. ఈ జెలాటిన్‌తో ఆయా వ్యాక్సిన్లు, ఔషధాల జీవితకాలం పెరుగుతుంది. ఔషధం చెడిపోకుండా, సురక్షితంగా ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు