ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని నోటిఫై చేశారు : కేంద్రం

మంగళవారం, 4 ఫిబ్రవరి 2020 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని 2015లోనే నోటిఫై చేయడం జరిగిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, రాజధాని విషయంలో తుది నిర్ణయం రాష్ట్రాలదేనని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 
 
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అమరావతిలో జరుగుతున్న రైతుల ఆందోళన, ఛలో అసెంబ్లీ కార్యక్రమం సందర్భంగా తన నిర్భధం, అరెస్టు, పోలీసుల దాడిని ఆయన సభలో ప్రస్తావించారు. 
 
దీనికి హోంశాఖసహాయ మంత్రి నిత్యానంద రాయ్ సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీ రాజధానిగా అమరావతిని కేంద్రం 2015లోనే నోటిఫై చేయడం జరిగిందన్నారు. అదేసమయంలో మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మీడియాలో వచ్చిన రిపోర్టుల ఆధారంగా తెలిసిందన్నారు. 
 
అయితే, రాజధాని ఏర్పాటు అంశం రాష్ట్రానిదే తుది నిర్ణయమన్నారు. ఇక్కడ మంత్రి నిత్యానంద రాయ్ చేసిన వ్యాఖ్యల్లో రాజధాని అని మాత్రమే చెప్పారుగానీ, రాజధానులు అని మాత్రం చెప్పలేదు. కేంద్రం తాజా ప్రకటన వైకాపా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. 
 
ఎందుకంటే మూడు రాజధానుల ఏర్పాటు అంశం కేంద్రానికి చెప్పి చేస్తున్నామంటూ వైకాపా నేతలు, ప్రజా ప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పదేపదే చెబుతూ ప్రచారం చేస్తున్నారు. వైకాపా చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని కేంద్రం ఈ ప్రకటన ద్వారా తేల్చిచెప్పినట్టయింది. ఇపుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో వేచిచూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు