అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న భారత గగన వీరుల జీవిత చరిత్ర ఏంటి?

వరుణ్

బుధవారం, 28 ఫిబ్రవరి 2024 (12:06 IST)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వచ్చే యేడాది ప్రతిష్టాత్మకంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్ యాన్ చేపట్టనుంది. ఇందులో నలుగురు వ్యోమగాములను రోదసీలోకి పంపించనుంది. వీరిని 2019లోనే భారత వైమానికదళం నుంచి ఇస్రో ఎంపిక చేసింది. వీరిలో ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి, మిగిలిన ఇద్దరు తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి ఎంపిక చేశారు. వీరికి గత నాలుగేళ్లుగా వివిధ స్థాయిలలో శిక్షణ ఇచ్చారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థలో వీరు శిక్షణను పూర్తి చేసుకున్నారు. ఈ నలుగురు వ్యోమగాములను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం యావత్ దేశానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నలుగురు వ్యక్తులు కాదని, 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులుగా అభివర్ణించారు. అలాంటి ఆస్ట్రోనట్స్ జీవిత విశేషాలను పరిశీలిస్తే, 
 
అజిత్ కృష్ణన్ : చెన్నైలో 1982లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ విద్యార్థి. రాష్ట్రపతి పసిడి పతకంతో సహా వైమానిక అకాడెమీలో ఖడ్గ సత్కార గ్రహీత. 2003లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో నియాకం పొందారు. 2900 గంటల అనుభవం ఉంది. ఎస్‌యూ 30 ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, హాక్, డార్నియర్, ఏఎన్ 32లను నడిపిన అనుభవం ఆయన సొంతం.
 
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ : కేరళలో 1976లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ విద్యార్థి. ఖడ్గ సత్కార గ్రహీత. 1998లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొందారు. 3000 గంటల అనుభవం ఉంది. ఎస్‌యూ 30, ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, హాక్, డార్నియర్, ఏఎన్ 32లను నడిపిన అనుభవం ఉంది. 
 
అంగద్ ప్రతాప్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో 1982లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ విద్యార్థి. 2004లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొందారు. 2000 గంటల అనుభవం సొంతం. ఎస్‌యూ 30, ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, హాక్, డార్నియర్, జాగౌర్, ఏఎన్ 32లను నడిపిన అనుభవం ఉంది. 
 
సంఖాంశు శుక్లా : ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో 1985లో జన్మించారు. నేషనల్ డిఫెన్స్ అకాడెమీ విద్యార్థి. 2006లో ఐఏఎఫ్ యుద్ధ విమానాల విభాగంలో నియామకం పొందారు. 2000 గంటల అనుభవం ఉంది. ఎస్యూ 30, ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, హాక్, డార్నియర్, జాగౌర్, ఏఎన్ 32లను నడిపిన అనుభవం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు