మైఖేల్‌ జాక్సన్‌ పేరు తెచ్చుకుంది బుల్లితెర మీదే..!: దాసరి

WD
వెండితెరకన్నా బుల్లితెర ఎక్కువ ఆదరణ పొందుతుందని దర్శకరత్న దాసరి నారాయణరావు అన్నారు. పాప్‌కింగ్ మైఖేల్ జాక్సన్‌కు కూడా గుర్తింపు లభించింది బుల్లితెరపైనేనని గుర్తుచేశారు.

ఏడాదిపాటు సినిమాలు చేసినా బుల్లితెరపై వచ్చే సీరియల్స్‌కు ఎంతో గుర్తింపు, పలుకుబడి వస్తోందని, సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై దాసరి నారాయణరావు సమర్పణలో దాసరి పద్మ నిర్మిస్తోన్న "అభిషేకం" సీరియల్ 200 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ గురించి దాసరి మాట్లాడుతూ.. ప్రస్తుతం సీరియల్స్‌కున్న ఆదరణ సినిమాలకు లేదు. ఏడాదికి ఒకటోరెండో గొప్ప చిత్రాలు వస్తుంటాయి. తాను 1988లో విశ్వామిత్ర సీరియల్ తీశాను. తర్వాత మహాభారతం సీరియల్‌కు ప్రేక్షకాదరణ పెరిగింది. ఇందులో బీటాకామ్ కెమెరాను తొలిసారిగా వాడాను.

సీరియల్స్ తీయాలనేది మా ఆవిడ కోరిక. దాదాపు 12 సంవత్సరాల క్రితమే "అభిషేకం"కు పూజా కార్యక్రమాలు ఇంట్లో జరిగాయి. డబ్బింగ్ సీరియల్స్ చూస్తున్న ప్రేక్షకులకు అచ్చ తెలుగులో రూపొందిస్తోన్న సీరియల్ ఇదని దాసరి చెప్పుకొచ్చారు. ఈ నెల 28న "తూర్పుపడమర" సీరియల్‌ను కూడా ప్రసారం చేయనున్నామని వెల్లడించారు.

ఈటీవీ క్రియేటివ్ రచయి అజయ్‌శాంతి మాట్లాడుతూ.. దాసరి సినిమాలు మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబించేవిగా ఉంటాయి. ఈ అభిషేకం సీరియల్‌లో బాధలు, భావోద్వేగాలు ఉన్నాయి. 200 రోజులు పూర్తయిన సందర్భంగా ఇంకా ఈ సీరియల్ ముందుకు సాగాలని ఆమె ఆశించారు.

వెబ్దునియా పై చదవండి