గోవా గవర్నరుగా పూసపాటి అశోకగజపతి రాజు

ఠాగూర్

సోమవారం, 14 జులై 2025 (16:51 IST)
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సోమవారం రెండు రాష్ట్రాలకు గవర్నర్‌‍లను, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించారు. గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు, హర్యానా గవర్నర్‍‌గా ప్రొఫెసర్ ఆషింకుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాలను కేంద్రం నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ఏపీలోని విజయనగరానికి చెందిన అశోక్ గజపతి రాజు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు. గతంలో ఆయన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన, విజయనగరం రాజవంశానికి చెందిన ప్రముఖ వ్యక్తి. ఆయన గోవా గవర్నర్ నియమితులవడంపై టీడీపీ నాయకులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఇక, హర్యానా గవర్నర్‌గా ఇప్పటివరకు బండారు దత్తాత్రేయ సేవలందిస్తూ వచ్చారు. ఆయన స్థానంలో ప్రొఫెసర్ ఆషింకుమార్ ఘోషను కేంద్రం నియమించింది. విద్యారంగంలో ప్రముఖుడైన ఘోష్, ఈ కీలక పదవిని చేపట్టనున్నారు. అలాగే, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్తా నియమితులయ్యారు.
 
తెలుగు రాష్ట్రాల నుంచి గవర్నర్లుగా పనిచేసిన వారి సంఖ్య గణనీయంగా ఉంది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి పెద్ద రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లో 20 మంది తెలుగు వారు గవర్నర్లుగా సేవలందించారు. వీరిలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కొణిజేటి రోశయ్య వంటి ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు