వ్యవసాయ రంగానికి హైటెక్ సొబగులు .. విత్తమంత్రి నిర్మలమ్మ పద్దుల చిట్టా

బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (18:22 IST)
దేశానికి వెన్నెముకైన వ్యవసాయ రంగానికి కేంద్ర వార్షిక బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. ముఖ్యంగా, హైటెక్ సొబగులు కల్పించేలా నిధులు కేటాయింపులు జరిపారు. ముఖ్యంగా, వ్యవసాయ రంగాన్ని డిజిటల్ బాట పట్టించడం, ఆధునిక విధానాలు అందిపుచ్చుకోవడం, చిరు ధాన్యాల ప్రోత్సాహానికి కేంద్ర కొత్త ప్రతిపాదనలు చేసింది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అప్పర్ భద్ర ప్రాజెక్టు కోసం రూ.5300 కోట్లను కేటాయించింది. మరోవైపు, వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.20 లక్షల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించింది. 
 
బుధవారం లోక్‌సభలో విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయాన్ని పరిశ్రమలతో అనుసంధానం చేస్తామని తెలిపారు. వ్యవసాయానికి రుణ పరిమితిన 18.60 లక్షల కోట్ల రూపాయల నుంచి రూ.20 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. పంటల ప్రణాళిక, దిగుబడులు, పంట రక్షణ, మార్కెట్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలతో వ్యవసాయానికి డిజిటల్ మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. 
 
గ్రామీణ యువకుల అగ్రిస్టార్టప్‌లకు చేయూతనిచ్చేందుకు వ్యవసాయ ప్రోత్సాహక నిధిని కొత్తగా ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు. ఉద్యావన సాగులో నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి తెచ్చేలా రూ.2200 కోట్లతో హార్టికల్చర్ క్లీన్ ప్లాంట్ బడ్జెట్‌‌లో ప్రతిపాదించారు. తృణధాన్యాలకు భారత్‌ను కేంద్రంగా చేస్తామన్న నిర్మలా సీతారామన్ శ్రీఅన్న పథకం ద్వారా చిరు ధాన్యాల రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు