కామన్వెల్త్ బ్యాడ్మింటన్: క్వార్టర్స్‌లోకి సైనా నెహ్వాల్!

FILE
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ తన హవాను కొనసాగిస్తోంది. బ్యాడ్మింటన్ రెండో రౌండ్లో సైనా నెహ్వాల్ ప్రత్యర్థి బ్లాక్‌ను 21-0, 21-2 పాయింట్ల తేడాతో చిత్తుగా ఓడించింది.

24 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో సైనా నెహ్వాల్ ప్రత్యర్థిని భారీషాట్లతో కట్టడి చేసింది. నైజీరియాకు చెందిన కరోలిన్ బ్లాక్‌తో తలపడిన టాప్ సీడ్ సైనా నెహ్వాల్ ఆద్యంతం గట్టిపోటీని ప్రదర్శించింది. ఫలితంగా బ్యాడ్మింటన్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.

ఇదిలా ఉంటే బాక్సింగ్ విభాగంలో భారత్‌కు మరో ఏడు పతకాలు లభించే అవకాశముందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. సత్తా కలిగిన భారత బాక్సింగ్ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట పండిస్తుందని వారు ఆశిస్తున్నారు.

ఈ క్రమంలో అమన్ దీప్, సురంజయ్ సింగ్, జై భగవాన్, మనోజ్ కుమార్, దిల్బగ్ సింగ్, విజేందర్ సింగ్, పరమ్జీత్ సమోతలు ధీటుగా రాణించి, ఏడు పతకాలు సాధిస్తారని అభిమానులు సైతం ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి