ఆ మూడు లక్షణాలు సమపాళ్లలో లేకపోతే...?

గురువారం, 15 నవంబరు 2007 (11:56 IST)
వివిధ రకాల పనులు చేయడానికి శరీరంలోని జీవ శక్తే కారణమని ఆయుర్వేదంలో తరచూ చెబుతుంటారు. శరీరంలోని మూడు రకాల జీవశక్తులు వాత, పిత్త, కస లక్షణాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొంటారు. ద్రవాలను, పౌష్టిక పదార్ధాలను జీవకణాలుగా మార్చడం వాత లక్షణం చేసే పని. వాటిని మెటబాలిజం చెందేలా చేయడం పిత్త లక్షణం. జీవశక్తి శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అయ్యేలా కణవ్యవస్థను తీర్చిదిద్దడం కఫ లక్షణం.

మానవులందరిలోనూ ఈ మూడు లక్షణాలు వుంటాయి. అయితే అందరిలోనూ ఒకే విధంగా వుండవు. కొందరిలో వాత లక్షణం ప్రాథమిక స్వభావం కాగా, మిగిలిన రెండు తదుపరి స్థానాల్లో వుంటాయి. వాటిని బట్టి ఆ వ్యక్తి శరీర తత్వాన్ని నిర్ణయించడం జరుగుతుంది.

ఆకాశం- వాయువు తత్వాల సమ్మేళనంతో వాత లక్షణం ఏర్పడుతుంది. కండరాల నిర్మాణాన్ని, శ్వాస విధానాన్ని నియంత్ర్తిసుంది.
హృదయ స్పందన, జీవకణ నిర్మాణానికి ఈ వాత లక్షణం దోహదం చేస్తుంది. శరీరంలో సమపాళ్ళలో వాతతత్వం వుంటే సృజనాత్మకతని, వినయాన్ని, సర్దుకుపోయే తత్వాన్ని పెంపొందిస్తుంది. ఒక వేళ యిందులో అసమానత ఏర్పడితే భయాందోళనలను కలిగిస్తుంది.

పిత్తం- అగ్ని, జల తత్వాల ఆధారంగా రూపొందిన లక్షణం. శరీరపు ధాతుశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణశక్తిని, శారీరపుష్టిని, శరీర ఉష్ణోగ్రతని ఇవి పరిరక్షిస్తుంది. ఈ లక్షణం వల్ల దృష్టి, జీర్ణశక్తి, వేడిని కలిగించే గుణం, ఆకలి, దాహం, ఆనందం, తెలివితేటలు కలుగుతాయి. ఒకవేళ పిత్త లక్షణం సరైన పాళ్ళల్లో లేకపోతే కోపాన్ని, అసూయ ద్వేషాలను కలిగిస్తుంది.

కఫం- భూమి, నీరు కలయిక వల్ల ఏర్పడుతుంది. దీని శక్తివల్ల ఎముకలు, కండరాలు, నరాలు బలిష్టమవుతాయి. అంతేకాకుండా జీవకణాలను కలిపి వుంచే శక్తి కూడా దీని ద్వారానే ఏర్పడుతుంది. శరీరంలోని బాగాలన్నింటికి కఫం ద్వారానే నీరు అందుతుంది.
కఫ లక్షణం సమపాళ్ళల్లో వుంటే ప్రేమ, ప్రశాంతత, దయాగుణాలు వుంటాయి. ఒకవేళ సమపాళ్్లళలో లేకపోతే అసూయ ద్వేషం పెరుగుతుంది.

ఈ మూడు - వాత, పిత్త, కఫ దోషాలు శరీరంలోని అన్ని భాగాలను సాధారణ స్థితిలో ఉంచేందుకు దోహదపడటమే కాకుండా, ఏడు ధాతువులు, రసం, రక్త, మాంసాలు, మేధ, అస్తి, మజ్ఞ, శుక్ల, మల మొదలయిన వాటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది.
అందువలన మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ మూడు లక్షణాలు సమపాళ్ళల్లో పనిచేయాలి. మన శరీరతత్వం, సమస్యలు తెలిస్తే-వాటిని చికిత్సను కనుగొనడం సులభం.

జీవితం ఓ వలయం. ఎన్నో అవకాశాలు-మరెన్నో సవాళ్ళు! కొన్ని అంశాలు మన చేతుల్లో ఉండవు. మరికొన్నింటిని మనం నియంత్రించగలం. ‘మనకు ఎంతవరకు పరిమితమో అంతవరకే’ అని వాపోయే కన్నా, ముందుగానే జాగ్రత్త పడి, మనం కంట్రోల్‌ చేయదగ్గ అంశాలు కంట్రోల్‌ చేయడం ఉత్తమం. జీవన విధానం, జీవితం పట్ల మనకి వుండే దృక్పథం, ఆహార వ్యవహారాలు మన చేతుల్లోనే వుంటాయి. కాబట్టి వాటి పట్ల జాగ్రత్త పడటం మంచిది.

వ్యాధులు ఎలా ఏర్పడతాయి?

లోగడ చెప్పినట్లుగానే వ్యాధులు మూడు ప్రాధమిక లక్షణాలు(వాతం, పిత్తం, కఫం) అసమతుల్యత ఆధారంగా ఏర్పడతాయని ఆయుర్వేదం చెబుతుంది. అన్ని రకాల వ్యాధులను ఆయుర్వేదం ప్రకారం మూడు రకాలుగా వర్గీకరించాయి.

అధిభౌతికం:-ప్రకృతి సిద్ధంగా ఏర్పడే వ్యాధులు

అధి దైహికం :- శారీరక, మానసిక సమస్యల కారణంగా ఏర్పడే వ్యాధులు

అధి దైవికం:- దైవ సంబంధిత లేదా దుష్టశక్తుల కారణంగా ఏర్పడే వ్యాధులు.

మరింత సులభంగా చికిత్స చేసేందుకు వీలుగా ఈ కింద విధాలుగా విభజించారు.

ఆది బాల ప్రవృతి - జన్యు సంబంధంగా వచ్చే అనారోగ్య సమస్యలు.

జన్మ బాల: పుట్టుకతో ఏర్పడిన వ్యాధులు.

దోష బాల: వాత, పిత్త, కఫ సమతుల్యత దెబ్బతినడం వల్ల తలెత్తే వ్యాధులు

సంఘట బాల: మానసిక, శారీరక సమస్యల కారణంగా ఏర్పడే వ్యాధులు.

కాల బాల: ఓ ప్రత్యేక సమయం/ఋతువులో ఏర్పడే వ్యాధులు.

దైవ బాల: దేవతా శక్తులు, దుష్ట శక్తుల కారణంగా ఏర్పడే సమస్యలు.

స్వభావ బాల: సహజ సిద్ధంగా ఏర్పడే మార్పులు (వయసుకి తగినట్లు ఏర్పడే సమస్యలు).

వెబ్దునియా పై చదవండి