ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొందరు యువకులు మద్యంమత్తులో రెచ్చిపోయారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. పట్టణంలో నానా హంగామా చేశారు. ఓ ప్రైవేటు స్కూలు వాహనంలో కూర్చొనివున్న ఓ విద్యార్థినిపై దాడి చేశారు. నడిరోడ్డుపై వీరంగం సృష్టిస్తూ స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరంలో శుక్రవారం కొందరు యువకులు పీకల వరకు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ కాలేజీ బస్సులోని విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థిని నోటికి వచ్చినట్టు దుర్భాషలాడారు. తమపై ఎందుకు దాడి చేస్తున్నారంటూ ఆ విద్యార్థి ప్రశ్నించడంతో యువకులు మరింతగా రెచ్చిపోయారు. ప్రశ్నించిన యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచారు.