తెలుగునాట ఆధునిక భావ వికాసానికి పట్టుగొమ్మలుగా నిలిచిన మహామహులలో చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఒకరు. ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త అయిన చిలకమర్తి... 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్య అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆయన అస్తమించిన రోజును చరిత్రలో జూన్ 17వ తేదీ ప్రత్యేకతగా చెప్పవచ్చు.
లక్ష్మీనరసింహం పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలంలోని ఖండవల్లి గ్రామానికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో వెంకయ్య, రత్నమ్మ అనే దంపతులకు 1876, సెప్టెంబర్ 26వ తేదీన జన్మించారు. వీరవాసరం, నరసాపురం పట్టణాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన చిలకమర్తి, 1889లో రాజమండ్రి హైస్కూలులో పట్టా పుచ్చుకున్నారు. 1889లోనే రాజమండ్రిలో ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు.
అనంతరం ఇన్నీస్ పేట పాఠశాలలోనూ, మునిసిపల్ హైస్కూల్లోనూ విద్యాబోధన సాగించిన లక్ష్మీ నరసింహం, ఆపై ఒక సంవత్సరంపాటు పత్రికా సంపాదకునిగా కూడా పనిచేశారు. అటుపై ఉద్యోగానికి స్వస్తి చెప్పి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ను స్థాపించి తొమ్మిది సంవత్సరాలపాటు నడిపారు. ఆ తరువాత అది వీరేశలింగం హైస్కూల్గా పేరు మార్చబడింది.
మొదటి తరం సంఘ సంస్కర్త
చిలకమర్తిగారు 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి, పదమూడు సంవత్సరాలపాటు ఏకధాటిగా నడిపారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు.
చిలకమర్తి పాఠశాలకు వెళ్లేటప్పుడే పద్యాలు రాయడం ప్రారంభించటమేగాక, ఆపై ఎన్నో రచనలు చేశారు. కీచకవధ ఆయన మొదయి నాటకం కాగా, ఆ తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలను రచించారు. నవలా రచనల్లో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. ఇక హాస్య రచనల విషయానికి వస్తే.. "గణపతి" అనే నవల ఎన్నదగింది.
22 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు చిలకమర్తి రచించిన "గయోపాఖ్యానం" అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో కనీ, వినీ, ఎరగని విషయంగా చరిత్రలో నిలిచిపోయింది. పైగా ఈ నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు అర్జునుడి వేషం వేశారట.
30వ ఏట నుండి రేచీకటి వ్యాధికి గురైనా ఏ మాత్రం బెదరకుండా, తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి చిలకమర్తి రచనలు కొనసాగించారు. 1908లో ఒక ప్రెస్ స్థాపించిన ఆయన... 1916లో మనోరమ, పత్రిక అనే పత్రికలను స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర, సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. అలా ఆయన రచనలు 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి. 1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం చిలకమర్తిని "కళాప్రపూర్ణ పురస్కారం"తో సత్కరించింది.
మొదటి తరం సంఘ సంస్కర్తగా కూడా లక్ష్మీ నరసింహం పేరుపొందారు. 1909లో సామాజికంగా వెనుకబడిన వర్గాలకోసం ఒక పాఠశాల ప్రారంభించి, పదమూడు సంవత్సరాలపాటు ఏకధాటిగా నడిపారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. "దేశమాత" అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.
మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి హరిజనులకోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. అందుకే వాసురాయకవి చిలకమర్తి వారిది "ఫొటోజెనిక్ మెమరీ" అని ప్రశంసించారు. మంచి వక్త, శ్రోతలను బాగా ఆకట్టుకునే చిలకమర్తి, భారత జాతీయ కాంగ్రెస్ కార్యకలాపాలలో కూడా చురుకుగా పాల్గొన్నారు. "లోకల్ షేక్స్పియర్"గా అనేక ప్రశంసలందుకున్న లక్ష్మీ నరసింహం 1946, జూన్ 17వ తేదీన పరమపదించారు.