తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలి: ఎన్నారైల డిమాండ్

మంగళవారం, 22 నవంబరు 2011 (13:36 IST)
PR
పీపుల్ ఫర్ లోక్‌సత్తా మరియు ఎన్నారైల ఆధ్వర్యంలో లాస్ ఏంజలీస్‌లోని తెలుగువారందరూ తెలంగాణ సమస్యను త్వరితగతిన పరిష్కరించమని భారత సర్కారుని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. శనివారం(నవంబర్ 19) మద్యాహ్నం 12 గంటలకు లాస్ ఏంజలీస్‌లోని, ఎన్నారైలు అధికంగా వుండే అర్టీసియా ప్రాంతంలో ర్యాలీ చేశారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సమస్యకు పరిష్కారం కాక గత రెండు సంవత్సరాలుగా ప్రాంతీయ విభేదాలు పెరగటం, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం, సకల జనుల సమ్మె, ఆత్మహత్యలు, సామాన్య ప్రజలు ఇబ్బందులు గురికావటం జరుగుతోంది. అయినా అధికార పక్షం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సమస్యని పరిష్కరించే దిశగా స్పష్టమైన అడుగులు వేయటం లేదు. ఈ సమస్యతో రాష్ట్రంలో పరిపాలన కూడా కుంటుపడిపోయింది.

2009 డిసెంబర్ 9న, 23న పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజలని తప్పుదోవ పట్టించినట్లు కాకుండా, అందరికి న్యాయం జరిగే పరిష్కారం చూపించి, దాని మీద గట్టిగా నిలబడాలని లాస్ ఏంజలీస్‌లోని తెలుగువారు కోరుతున్నారు. ప్రభుత్వం వారి తీర్పుని ప్రకటించేటప్పుడు దాని వెనక వున్న హేతుబద్ధమైన ఆలోచన మరియూ ఐక్యరాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు కలిగిన, అలాగే విడిపోతే సీమాంధ్ర ప్రజలకు కలిగే ఇబ్బందులు, కష్టనష్టాలేమిటనేవి అన్నీ ప్రాంతాల వారికి అర్థమయ్యేట్టు వివరించమని డిమాండ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి