కలియుగదైవం శ్రీశ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ వాతావరణంలో ఒక్కోరోజు గడచి పోతున్నాయి. గత శనివారం ప్రారంభమైన ఈ బ్రహ్మోత్సవాలు నేటి (బుధవారం)కి ఐదో రోజుకు చేరుకున్నాయి. ఐదో రోజు జరిగే వాహనానికి ప్రత్యేక స్థానం ఉంది. పగలు ఊరేగింపులో శ్రీనివాసుడు అమృతాన్ని పంచినప్పటి అద్భుత అందాల రాశి జగన్మోహిని అవతారంలో "దంతపు పల్లకి"లో, వెనుకనే మరో "రంగుల పల్లకి" నవనీత నందనందనుడు వెంటరాగా- సందర్శకులకు ఆనందాలను, ఆశీస్సులను అందిస్తూ అత్యంత వైభవంగా విజయవిహారం చేస్తారు.
ఈ సందర్భంగా జగన్మోహిని భుజంపై ఒక "బంగారు చిలుక"ను కనువిందుగా అమర్చుతారు. ఇంకో విషయమేమిటంటే... ఇరువురు మూర్తులు ఇతర రోజుల్లోలాగా "ఉత్సవ మండపం" నుంచి గాక నేరుగా "గర్భాలయం" నుంచే సాలంకృతులై బయటకు రావడం ఐదో రోజు ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
బుధవారం జరిగే కార్యక్రమ వివరాలు ఇలా వున్నాయి. మోహినీ అవతారము... ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు, ఊంజల్సేవ... సాయంత్రం 5.30 గంటల నుంచి 6.30 గంటల వరకు, గరుడసేవ... రాత్రి 9.00 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటల వరకు, సర్వదర్శనము... ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు, సర్వదర్శనము... సాయంత్రం 5.30 గంటల నుంచి అర్థరాత్రి 1.00 గంటలకు జరుగుతాయి.