పహల్గామ్లో ఉగ్రమూకలు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో భారత నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కూడా ఉన్నారు. ఈ నెల 16వ తేదీన హిమాన్షి అనే యువతిని వివాహం చేసుకున్న వినయ్.. హనీమూన్ కోసం కాశ్మీర్కు వెళ్లారు. ఈ నవ దంపతులు పహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్ పర్యాటక అందాలను తిలకిస్తుండగా, ఉగ్రవాదులు జరిపిన దాడిలో వినయ్ ప్రాణాలు కోల్పోయాడు.
వినయ్ పార్థివదేహానికి గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తిగా సైనిక లాంఛనాలతో వీటిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా వినయ్ భార్య హిమన్షి తన భర్తకు కన్నీటి వీడ్కోలు చెప్పారు. శవపేటికపై తలవాల్చి బోరున విలపించగా, ఆమె సోదరుడు, తల్లి ఓదార్చారు. ఆ తర్వాత జైహింద్ అంటూ తన భర్తకు వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చుతున్నాయి.
మరోవైపు, వినయ్ నర్వాల్ మృతిపై భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి ఒక ప్రకటన చేశారు. 'పహల్గామ్లో జరిగిన దారుణమైన ఉగ్రవాదదాడిలో మరణించిన లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ విషాదకరంగా మరణించడం దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఊహించలేని దుఃఖంలో ఉన్న ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలుపుతున్నాం' అని పేర్కొన్నారు.