తమిళనాడు సీఎం జయలలిత అంత్యక్రియల్లో ఆమె నెచ్చెలి శశికళ అన్నీ తానై చూసుకున్నారు. అమ్మ భౌతికకాయం పక్కనే కూర్చుని.. నివాళులు అర్పించే వారిని పలకరించిన శశికళ, అంత్యక్రియలను కూడా తన చేతి మీదనే చేయించారు. అయితే పోయెస్ గార్డన్ నుంచి రాజాజీ హాలుకు.. అక్కడ నుంచి మెరీనా బీచ్ వరకు శశికళ భర్త నటరాజన్ తన పవర్ చూపించారు.
సోమవారం ఆయన జయలలిత పార్థివదేహం ఉంచిన రాజాజీ హాల్కు చేరుకుని అంజలి ఘటించడం ఇందుకు బలం చేకూరుస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలితకు శశికళ ఆప్తురాలిగా మారాక ఐఆర్ఎస్ అధికారి అయిన ఆమె భర్త నటరాజన్ ప్రభుత్వంలో, పార్టీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకునేవారు. అయితే ఆయన వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న జయలలిత అతడిని దూరంగా పెట్టేశారు. ఒకానొక సందర్భంలో శశికళను కూడా ఇంటి నుంచి పంపించేశారు. అయితే వేరే గత్యంతరం లేక శశికళ వారి కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగతెంపులు చేసుకుంది. ఆ తర్వాతే అమ్మ ఆమెకు తన ఇంట్లోకి రానిచ్చారు.
ఇన్నాళ్లూ జయకు దూరంగా ఉన్న నటరాజన్ సోమవారం పోయెస్ గార్డెన్కు వచ్చారు. మంగళవారం రాజాజీహాల్కు వచ్చి జయకు నివాళి అర్పించారు. అంత్యక్రియలకూ హాజరయ్యారు. దీంతో పార్టీలోకి ఆయన పున:ప్రవేశం జరిగినట్టేనని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జయ మృతి తర్వాత ముఖ్యమంత్రి ఎంపికలో కీలకంగా వ్యవహరించిన శశికళ.. ఇప్పుడు భర్తతో కలిసి చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
అదే కనుక జరిగితే జయలలిత నమ్మిన బంటు ప్రస్తుత సీఎం ఓ పన్నీర్ సెల్వంకు కష్టాలు తప్పవని.. ఆయనను పక్కనబెట్టి నటరాజన్ శశికళను సీఎం చేసేందుకైనా వెనుకాడడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇది జరిగితే అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమవుతాయని.. ఇది ప్రతిపక్షానికి ప్రభుత్వానికి కూల్చేందుకు అవకాశంగానూ మారే ఛాన్సుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.