వైఎస్ ప్రజల మనిషి: క్షేమంగా తిరిగొస్తారు: చిరు

బుధవారం, 2 సెప్టెంబరు 2009 (18:44 IST)
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రజల మనిషి అని ఆయన క్షేమంగా తిరిగి వస్తారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగదని, ఆయన ఖచ్చితంగా తిరిగి ప్రజాసేవకు పునరంకితం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.

మూడు జిల్లాల పర్యటనకు బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్.. కొద్దిసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ మాయమైన విషయం తెల్సిందే. దీనిపై అటు రాష్ట్రంతో పాటు.. ఇటు దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా, హెలికాఫ్టర్ ఆచూకీ ఇంతవరకు తెలియరాలేదు.

ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ మిస్సింగ్ వ్యవహారంపై ప్రరాపా అధినేత చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్ ప్రజాబలం ఉన్న నేత. ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువగా ఉంది. అందువల్ల ఆయన క్షేమంగా సురక్షితంగా చేరుకుంటారని చిరు విశ్వాసం వ్యక్తం చేశారు.

నల్లమల అటవీ ప్రాంతం దట్టంగా ఉంటుందని, కొండలు ఉంటాయని అందువల్ల ఆయన బయటకు రావడంలో ఆలస్యం జరిగి ఉంటుందని ఆయన చెప్పారు. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు.

అడువుల్లో చిక్కుకుపోయిన ముఖ్యమంత్రికి సాయం చేయడానికి తన అభిమానులు సైతం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన కోసం స్థానిక ప్రజలతో కలిసి తన అభిమానులు, ప్రరాపా కార్యకర్తలు గాలింపు చర్యలు చేపట్టాలని చిరంజీవి ఆదేశించారు.

వెబ్దునియా పై చదవండి