మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా

శనివారం, 5 సెప్టెంబరు 2009 (15:47 IST)
ముఖ్యమంత్రి వైఎస్‌తో పాటు హెలికాఫ్టర్ ప్రయాణిస్తూ దుర్మరణం పాలైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. హెలికాఫ్టర్ పైలట్, కో పైలట్‌తో పాటు.. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి కుటుంబాలకు తక్షణం పది లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేయనున్నట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు.

ఈ మేరకు శనివారం ఉదయం తాను నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు రోశయ్య తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగి మరణాంతరం లభించే నిధులకు, తాము అందించే ఎక్స్‌గ్రేషియాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. అలాగే, మృతుల కుటుంబాల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతో పాటు.. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు.

కాగా, నల్లమల అడవుల్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో సీఎం రాజశేఖర్ రెడ్డితో పాటు.. సీఎస్ఓ వెస్లీ, ప్రిన్సిపల్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, పైలట్ భాటియా, కో పైలట్ ఎంఎస్‌రెడ్డిలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి