రాజీనామా చేయాలని వుంది: సీఎం రోశయ్య ఆవేదన!

సోమవారం, 21 డిశెంబరు 2009 (15:59 IST)
అత్యంత క్లిష్ట పరిస్థితిలో తాను చేపట్టిన ముఖ్యమంత్రి పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఉందని ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ఇరవై రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల్లో ఏ ఒక్కటి కూడా తనను ప్రశాంతంగా ఉండనీయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోయినా ఒకటేనని ఆయన మనస్థాపం చెందారు.

ఈ విషయాన్ని సోమవారం ఆయన కొంతమంది సన్నిహితులైన మంత్రుల వద్ద వాపోయినట్టు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేంద్రం సానుకూల ప్రకటన చేయడంతో రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ఒకవైపు తెలంగాణ ఉద్యమం సద్దుమణిగిందని నవ్వాలో.. మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినందుకు ఏడ్వాలో అర్థంకాని సంకట స్థితిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహారదీక్షకు దిగిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆదివారం రాత్రి అకస్మాతుగా అదృశ్యమయ్యారు. ఇది ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నించేలా చేసింది. దీనిపై చర్చించేందుకు సోమవారం ఉదయం అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రోశయ్య పైవిధంగా వాపోయినట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి