వైఎస్.జగన్మోహన్ ఢిల్లీ దీక్షపై కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన!!

శనివారం, 8 జనవరి 2011 (12:32 IST)
కాంగ్రెస్ మాజీ యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఈనెల 11వ తేదీన ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం హైరానా చెందుతోంది. జగన్ చేపట్టే నిరశన దీక్ష ఒక రకంగా ఢిల్లీలో బలప్రదర్శన లాంటిందని రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దీక్షకు ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకెళ్లేందుకు జగన్ కృషి చేస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దించింది. జగన్ ట్రాప్‌లో ఎమ్మెల్యేలు పడకుండా కట్టడి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా కోరింది. ముఖ్యంగా, జగన్ వెంట నడిచే ప్రజాప్రతినిధులు రాష్ట్ర సరిహద్దులు దాటి హస్తినలో కాలుపెట్టకుండా ప్రలోభాలకు గురిచేసేలా చర్యలు తీసుకోవాలని అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు సమాచారం.

పోలవరం ప్రాజెక్టుతో పాటు కృష్ణ ట్రిబ్యునల్ తీర్పు ఇదే అంశంపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో రెండు రోజుల క్రితం సమావేశమయ్యారు. ఇది పేరుకు మాత్రం కృష్ణాట్రిబ్యునల్ తీర్పు అంశమే అయినప్పటికీ.. వాస్తవానికి సీమాంధ్ర ఎంపీలతో జగన్ విషయాన్నే సోనియా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానానికి అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో ఉన్న సమస్యలు చాలవన్నట్టుగా జగన్ సమస్య పెనుసవాల్‌గా మారింది. జగన్‌ను కట్టడి చేయలేకపోతే మొదటికే మోసం వచ్చేలా కనిపిస్తోందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

వెబ్దునియా పై చదవండి