సంక్షోభంలో పడ్డ పాక్ సర్కారు: కూలిపోవడం ఖాయమేనా..!?

సోమవారం, 3 జనవరి 2011 (10:42 IST)
కొత్త సంవత్సరంలో పాకిస్థాన్ సర్కారుకు గడ్డు కాలమే ఎదురయ్యేలా ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నేతృత్వంలోని పాక్ సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఈ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉన్న ముత్తహిదా కవామీ మూవ్‌మెంట్ (ఎమ్‌క్యూఎమ్) ఆదివారం ప్రభుత్వం నుంచి వైదొలగిపోయింది.

ప్రజలు ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, ధరల పెరుగుదల వంటి సమస్యల పరిష్కారంలో పిపిపి సర్కారు పూర్తిగా విఫలమైనందు వల్లే ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నామని ఎమ్‌క్యూఎమ్ పేర్కొంది. పిపిపి నుంచి ఎమ్‌క్యూఎమ్ బయటకు రావడంతో 342 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో ప్రభుత్వ బలం 157కు పడిపోయింది.

అయితే దీనిపై స్పందించిన పాక్ ప్రధానమంత్రి యూసఫ్ రజా గిలానీ మాట్లాడుతూ.. "దీనిపై నేను వ్యాఖ్యలు చేయను, మీడియా ద్వారానే నాకు విషయం తెలిసింది. ఎవ్వరున్నా లేకపోయినా ప్రభుత్వం స్థిరంగానే ఉంటుంద"ని అన్నారు. తన సర్కారుకు ఎలాంటి భయమూ లేదని గిలానీ చెప్పారు.

ఎమ్‌క్యూఎమ్‌కు సభలో 25 మంది సభ్యులున్నారు. 126 మంది సభ్యులున్న పిపిపికి ప్రస్తుతం ఇతర పార్టీలకు చెందిన 31 మంది సభ్యుల మద్దతుంది. ఎమ్‌క్యూఎమ్ మద్దతు ఉపసంహరించడంతో సాధారణ మెజారిటీకి సర్కారుకు ఇంకా 14 మంది మద్దతు కావాల్సి ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి