లష్కర్ కంటే హిందూ రాడికల్స్‌ నుంచే ముప్పు: రాహుల్

శుక్రవారం, 17 డిశెంబరు 2010 (13:22 IST)
తమ దేశానికి లష్కర్ తోయిబా వంటి తీవ్రవాద సంస్థల నుంచి కంటే నానాటికీ పెరుగుతున్న హిందూ రాడికల్స్ సంస్థల నుంచే ఎక్కువ ముప్పు పొంచివుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. ఈ విషయాన్ని ఆయన అమెరికా రాయబారి తిమోథీ రోమెర్‌తో జరిగిన భేటీ సందర్భంగా చెప్పినట్టు వికీలీక్స్ వెల్లడించింది. న్యూఢిల్లీలోని యూఎస్ రహస్య దౌత్య వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని వీకీలీక్స్ బహిర్గతం చేసింది.

తియోథీతో రాహుల్ భేటీ సందర్భంగా వచ్చే ఐదేళ్ళలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజకీయ అంశాలు, సమాజ సవాళ్లు, ఎన్నికల వ్యవస్థ తదితర అంశాలపై రాహుల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ సమయంలో రాహుల్ వ్యక్తం చేసిన పలు అంశాలను వికీలీక్స్ వెబ్‌సైట్ వెల్లడించింది.

అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన విందు సందర్భంగా రాహుల్‌కు, రిమోర్‌కు మధ్య సంభాషణ జరిగింది. లష్కర్ తోయిబా వంటి సంస్థల నుంచి భారత్‌కు పొంచివున్న ముప్పుపై తిమోటీ లేవనెత్తగా, దీనిపై రాహుల్ స్పందించారు. హిందూ గ్రూపుల పెరుగుదల వల్ల ముస్లింలతో మతపరమైన, రాజకీయపరమైన ఘర్షణలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

అయినప్పటికీ ఈ సంస్థల కంటే నానాటికీ వృద్ధి చెందుతున్న హిందూ రాడికల్స్ గ్రూపుల నుంచే పెను ముప్పు పొంచివుందన్నారు. వీటివల్లే దేశంలో మత ఉద్రిక్తతలు, రాజకీయ అనిశ్చితి నెలకొంటుందన్నారు. అదేసమయంలో లష్కరే తోయిబాకు దేశంలోని కొన్ని ముస్లిం గ్రూపుల నుంచి మద్దతు లభిస్తోందని ఆయన చెప్పారు.

ప్రధానంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ వంటి సంఘటిత హిందూ నాయకులు ఉద్రిక్తతలకు కారణమవుతున్నారని రాహుల్ అభిప్రాయపడ్డారు. రాడికల్ హిందూ గ్రూపుల నుంచి దేశ అంతర్గత భద్రతకు ముప్పు కొత్తదేమీ కాదని ఆయన అన్నారు. వికీలీక్స్ వెల్లడించిన రాహుల్ గాంధీ తిమోతి రిమోర్స్‌తో జరిపిన సంభాషణ వివరాలు కలకలం సృష్టిస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి