యాదగిరిగుట్ట స్వామివారి నగలు జరభద్రం!

FILE
ప్రసిద్ధ వైష్ణవ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామివారి, అమ్మవార్ల బంగారం, ఆభరణాలు సురక్షితంగా భద్రపరిచినట్లు దేవస్థానం ప్రకటించింది.

దాదాపు పదికోట్ల విలువగల వెండి, బంగారు ఆభరణాలన్నింటికి ఖచ్చితమైన లెక్కలతో పాటు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు వక్షస్థల కవచం, కిరీటాలు, అభయ వరద హస్తాలు, హారాలు, నిత్య అలంకారాల కోసం వినియోగించే బంగారు, వెండి ఆభరణాలు భద్రంగా ఉన్నాయని శ్రీనివాసరావు చెప్పారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడే ఆభరణాలు మాత్రం స్ట్రాంగ్ రూంలో భద్రపరచామని ఆయన వెల్లడించారు. దీంతో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు పదికోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు ముడిగా గలవాటికి బీమా సదుపాయం సైతం కల్పించినట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.

బంగారు, వెండి ఆభరణాలను ఆలయ అధికారులు, అర్చకుల సమక్షంలో జరిపిన తనీఖీలలో సక్రమంగా ఉన్నట్లు ప్రకటించారని, వీటికోసం ఆలయంలో ప్రత్యేకమైన సేఫ్టీ లాకర్ ఏర్పాటు చేసి వాటికి సాయుధ పోలీస్ బలగాలతో పాటు భద్రత సైతం ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి