నష్టాల్లో సెన్సెక్స్... పెరిగిన బంగారం ధరలు

మంగళవారం, 27 అక్టోబరు 2015 (17:19 IST)
దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూల పవనాలు లేకపోవడంతో మంగళవారం భారతీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 109 పాయింట్లు నష్టపోయి 27,253పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ 27పాయింట్లు నష్టపోయి 8,232 పాయింట్ల వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.64.97 వద్ద కొనసాగుతోంది. 
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో మారుతీ సుజుకీ షేర్లు అత్యధికంగా 3.01శాతం లాభపడి రూ.4,517 వద్ద ముగిశాయి. దీనితో పాటుగా సన్‌ ఫార్మా, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టీవీఎస్ మోటార్స్, ఫినొలెక్స్ ఇండస్ట్రీస్, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, కాక్స్ అండ్ కింగ్స్ కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అలాగే, లుపిన్ లిమిటెడ్, శ్రీ సిమెంట్, ఓఎన్జీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, జీఎస్ఎఫ్సీ, ఓఎన్‌జీసీ, గెయిల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సంస్థల షేర్లు నష్టపోయాయి. 
 
మరోవైపు.. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో మంగళవారం బంగారం ధర పెరిగింది. రూ.40 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.27,110కి చేరింది. కీలక సమయాల్లో నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం, ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో దీని ధర పెరిగినట్టు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. 
 
అంతర్జాతీయంగా లండన్‌ బులియన్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.23శాతం పెరిగి 1,165.60 అమెరికన్‌ డాలర్లకు చేరింది. ఈ రోజు వెండి ధర సైతం స్వల్పంగా పెరిగింది. రూ.15 పెరగడంతో కేజీ వెండి ధర రూ.37,125కు చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టడంతో దీని ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అలాగే అంతర్జాతీయంగా లండన్‌ మార్కెట్లో ఔన్సు వెండి ధర 15.90 అమెరికన్‌ డాలర్లుగా ఉంది.

వెబ్దునియా పై చదవండి