ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీపై నేడు తుది నిర్ణయం

ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది. ఐపీఎల్‌లో కొచ్చి ఫ్రాంచైజీ కొనసాగాలా..? లేదా..? అనే అంశంపై ఆదివారం నాడు జరగనున్న ఐపీఎల్ పాలక మండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని కౌన్సిల్‌కు చెందిన ఒక సభ్యుడు తెలిపారు.

ఈ సమావేశంలో పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలతో కొనసాగుతున్న న్యాయపరమైన వ్యాజ్యాలపై కూడా పాలక మండలి దృష్టి సారించనుంది. యాజమాన్య వాటాల విషయంలో ఉన్న వివాదాలకు ముగింపు పలికి, ఒకే కంపెనీగా ఏర్పడేందుకు కొచ్చికి గతంలో బీసీసీఐ నెల రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే.

గతవారం గడువు చివరి రోజున వాటాదారుల ఒప్పందాన్ని బోర్డుకు సమర్పించింది. ఈ ఫ్రాంచైజీలో 74 శాతం వాటాలను నాలుగు కంపెనీలకు చెందిన పెట్టుబడిదారులు కలిగి ఉన్నారు. కాగా.. దీని బిడ్డింగ్‌కు సహకరించిన గైక్వాడ్ కుటుంబానికి ఇందులో 26 శాతం ఉచిత వాటాలున్నాయి.

కానీ.. గైక్వాడ్ కుటుంబానికి ఆ 26 శాతం వాటాలను ఇచ్చేందుకు పెట్టుబడిదారులు సిద్ధంగా లేరు. దీంతో ఈ వివాదం ప్రారంభమైంది. మరోవైపు తమ కేసులో మధ్యవర్తిగా జస్టిస్ శ్రీకృష్ణను బీసీసీఐ కావాలనే వద్దంటోందని పంజాబ్ ఆరోపణలు చేస్తుంది.

వెబ్దునియా పై చదవండి