రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు - జగిత్యాలలో భారాస ప్రభుత్వం ఉందా? : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Video)

ఠాగూర్

మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:53 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర మనోవేదనను వ్యక్తం చేశారు. ఆయన ముఖ్య అనుచరుడు ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా మానసిక అవమానాలు, క్షోభకు గురికావడమే కాకుండా భౌతికంగా కూడా నష్టపోతున్నట్టు చెప్పారు. పార్టీ ఫిరాయింపుల పర్యవసానంగా ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితిని ప్రత్యర్థులు ఆసరా చేసుకుంటున్నారని, తనకు తోడుగా నిలిచిన సహోదరులను కోల్పోయిన తర్వాత ప్రజా జీవితం, రాజకీయాల్లో కొనసాగడమనేది ప్రశ్నార్థకంగా మిగులుతుందని ఆయన పేర్కొన్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నా ప్రజాసేవకు ఎప్పుడూ ముందుంటానని, కానీ ఈ అవమానాలు భరించడం మాత్రం ఇబ్బందిగా ఉందని ఆయన మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తంచేశారు. 
 
కాగా, జీవన్‌ రెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీటీసీ గంగారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. 58 యేళ్ల గంగారెడ్డిని జగిత్యాల జిల్లా జాబితాపూరులో హత్యకు గురయ్యారు. సంతోశ్ అనే వ్యక్తి గంగారెడ్డి కారుతో ఢీకొట్టి, ఆ తర్వాత కత్తితో పొడిచాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన గంగారెడ్డిని స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించగా ఆయన ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ హత్యను నిరసిస్తూ జగిత్యాల పాత బస్టాండు వద్ద తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులకే రక్షణ లేనపుడు తామెందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం, జగిత్యాలలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఉందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. 

 

మానసిక అవమానాలు, క్షోభకు గురి కావడమే కాకుండా భౌతికంగా కూడా నష్టపోతున్నా: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

పార్టీ ఫిరాయింపుల పర్యవసానంగా ఆత్మస్థైర్యం కోల్పోయే పరిస్థితిని ప్రత్యర్థులు ఆసరా చేసుకుంటున్నారు

నాకు తోడుగా నిలిచిన సహోదరులను కోల్పోయిన తర్వాత ప్రజా జీవితం, రాజకీయాల్లో… https://t.co/PYo5wkjzhZ pic.twitter.com/1BMEYysRER

— BIG TV Breaking News (@bigtvtelugu) October 22, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు