బంగినపల్లిని పోలిన మరో మామిడి పండు - పేరు గంగా..

సోమవారం, 13 జూన్ 2022 (17:33 IST)
వేసవి కాలం వచ్చిందంటే మామిడిపండ్ల కోసం జనాలు ఆతృతగా ఎదురు చూస్తుంటారు. అందులో మామిడిపండ్ల రారాజుగా ఉన్న బంగినపల్లి మామిడిపండు అంటే పడిచచ్చిపోతారు. అయితే, ఇపుడు బంగినపల్లిని పోలిన మరో కొత్త రకం మామిడి పండును ఆవిష్కరించారు. దీనికి గంగా అని నామకరణం చేశారు. ఈ కొత్త గంగా మామిడిపండును తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
 
సంగారెడ్డి కేంద్రంగా గంగా నర్సరీ ఉంది. ఇక్కడ ఏళ్ల తరబడి ఐసీ మోహన్ అనే ఔత్సాహిక రైతు మామిడి పండ్లపై పలు ప్రయోగాలు చేస్తున్నారు. వీటి ఫలితంగా ఇపుడు గంగా అనే కొత్త రకం మామిడిపండును ఆవిష్కరించారు. 
 
చూడ్డానికి అచ్చుగుద్దినట్టుగా బంగినపల్లి మామిడి పండును పోలిన ఈ గంగా మామిడి పండుకు ఆయన తన నర్సరీ పేరునే పెట్టారు. ఈ కొత్త మామిడి పండును ఆయన మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. 
 
ఇదే అంశంపై మంత్రి ఓ ట్వీట్ చేశారు. "నర్సరీలో వినూత్న ప్రయోగాలు సృష్టిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన సంగారెడ్డికి చెందిన గంగా నర్సరీ మామిడిలో సరికొత్త వంగడాన్ని సృష్టించారు. మామిడి పేరు వినపడగానే నోరూరించే బంగినపల్లి మామిడిని పోలి ఉండే ఈ వంగడానికి గంగాగా నామకరణం చేశారు. 
 
ఈ మేరకు హార్టికల్చర్ రంగంలో విశిష్ట గుర్తింపు ఉన్న గంగా నర్సరీ అధినేత ఐ.సి. మోహన్ ఆ వంగడాన్ని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో ఆవిష్కరింపజేశారు. ఆధునిక పరిజ్ఞానంతో ఫార్మ్ హౌజ్‌లకు సరికొత్త డిజైన్‌లను రూపొందించే మోహన్ మామిడిలో నూతన వంగడాన్ని సృష్టించడం అద్భుతమైన ప్రయోగం" అంటూ మంత్రి జగదీష్ రెడ్డి అభివర్ణించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు