తెలంగాణ రాష్ట్ర అధికార చిహ్నాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఖరారు చేశారు. రాష్ట్ర అధికార జంతువుగా జింక, రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, పుష్పంగా తంగేడు పువ్వు, వృక్షంగా జమ్మిచెట్టులను ఆయన ఎంపిక చేశారు. వీటి ఎంపికపై సీఎం ఆమోదంతో ప్రభుత్వం సోమవారం అధికారకంగా ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ సందర్భంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రం విజయపథంలో నడవడానికి శుభ సూచికంగా పాలపిట్టను ఎంపిక చేశామని తెలిపారు. తెలంగాణకు మేలు జరుగుతుందని జమ్మిచెట్టును, సౌభాగ్యాన్ని కాపాడే విశిష్టత తంగేడు పువ్వుకు ఉంటుందని తెలంగాణ ఆడపడుచులు భావించారని తంగేడు పువ్వును ఎంపిక చేశామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింభించేలా రాష్ట్ర అధికారక చిహ్నాలను ఎంపిక చేసిన కేసీఆర్కు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధన్యవాదాలు తెలిపారు.