70 శాతం పూర్తయిన "మిస్టర్ గిరీశం"

సోమవారం, 29 సెప్టెంబరు 2008 (16:05 IST)
WD
కృష్ణభగవాన్, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "మిస్టర్ గిరీశం". ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై విశ్వప్రసాద్ దర్శకత్వంలో కె. రమేష్ చంద్ర బెనర్జీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జూబ్లీహిల్స్‌లోని ప్రైవేట్ భవంతిలో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ఇప్పటికే 70శాతం షూటింగ్ పూర్తయిందని, దసరా నాటికి సినిమాను పూర్తిచేస్తామన్నారు.

నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కథ గురించి చెబుతూ... "కన్యాశుల్కం"లోని గిరీశం పాత్రను మోడ్రనైజ్ చేసి తీస్తున్నామని, పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని వెల్లడించారు. అందరూ పాత్రలకు తగ్గట్టు చక్కగా అమరారని, చిత్ర యూనిట్‌కు మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ.. జూన్‌లో ఈ చిత్రాన్ని ప్రారంభించామని, ఏకధాటిగా షూటింగ్ జరుగుతోందన్నారు. మధురవాణి పాత్రలో రమ్యకృష్ణ నటించడం చిత్రానికి హైలైట్‌గా ఉంటుందన్నారు. మ్యూజిక్ పరంగా మంచి చిత్రమవుతుందని వెల్లడించారు.

కృష్ణభగవాన్ మాట్లాడుతూ.. గురజాడ కన్యాశుల్కంలోని గిరీశం పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఇందులో నేను హీరో కాదని, కథే హీరోఅని చెప్పారు. రమ్యకృష్ణతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని, దర్శకుడు అనుకున్నది అనుకున్నట్లుగా చిత్రీకరిస్తున్నారని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో సైరాభాను, క్రిషి, జయప్రకాష్ రెడ్డి, జీవా, సందేశ్, అపూర్వ, బాలాజీ, రామ్‌జగన్, పద్మాజయంతి తదితరులు నటిస్తున్నారు. మాటలు... కొర్నిపాటి వేణుభార్గవ్, కెమెరా... రాజేష్ కాట, సంగీతం... ఎస్.ఎ. ఖుద్దూస్, ఎడిటింగ్... అనిరుద్రారెడ్డి, దర్శకత్వం... విశ్వప్రసాద్.

వెబ్దునియా పై చదవండి