ప్రభాస్ హీరోగా, రానా ప్రతినాయకుడిగా, అనుష్క, తమన్నా హీరోయిన్లుగా, రమ్యకృష్ణ, నాజర్ వంటివారు ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. ఈ చిత్రం తొలి భాగం గత 2015లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం రెండో భాగం "బాహుబలి 2 ది కంక్లూజన్" వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం కోసం సినీ ప్రేక్షకులంతా అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ బాహుబలి చిత్ర నిర్మాణం, కథ, గ్రాఫిక్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ‘బాహుబలి’ సినిమాలో ఏముంది అని నిలదీశారు. ఓ యూట్యూబ్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘బాహుబలి’ గురించి మాట్లాడారు.
"నేను బాహుబలి సినిమా చూశాను. ఏముంది అందులో. కథగా చెప్పుకోవడానికి అసలేముంది. ఆ సినిమా గురించి చాలా సింపుల్గా మూడు వాక్యాల్లో చెప్పొచ్చు. భారీ సెట్లు, గ్రాఫిక్స్ మాత్రం ఉన్నాయి. మా రోజుల్లో వాటిని ‘ట్రిక్స్’ అనే వాళ్లం. ఇప్పుడు దానికి అందమైన పేరు పెట్టి ‘గ్రాఫిక్స్’ అంటున్నారు. మన మార్కెట్కు రూ.500 కోట్లు పెట్టాల్సిన అవసరముందా?. ఆ బడ్జెట్తో 500 చిత్రాలు చేసుకోవచ్చు. అయినా ఇలాంటి సినిమాలను హాలీవుడ్ వాళ్లు ఎప్పుడో తీశారు. వీటన్నింటినీ ఎన్నో ఇంగ్లీష్ సినిమాల్లో చూశాం. బోలెడు ఖర్చుపెట్టి సెట్లు వేసి సినిమా తీసేస్తే మన తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టేనా? మొన్న ‘బిచ్చగాడు’ అనే చిన్న సినిమా వచ్చింది. బ్రహ్మాండంగా ఆడింది. గతంలో వచ్చిన ఎన్నో సినిమాలు అద్భుతంగా ఆడాయి. వాటిల్లో నీతి కూడా ఉండేది. కళ్లు జిగేల్మనిపించేలా సెట్లు వేసేస్తే తెలుగు సినిమా స్థాయి పెరిగినట్టా" అని సత్యనారాయణ ప్రశ్నించారు.