"ఇట్లు శ్రావణిసుబ్రహ్మణ్యం" చిత్రం చూసినవారికి ఆ సినిమా గుర్తుండే ఉంటుంది. యువతీ,యువకుడు ఆత్మహత్య చేసుకోవడానికి అనుకోకుండా రావడంతో వారిలో ప్రేమ చిగురిస్తుంది. చివరికి బతకాలని ఒకరికోసం ఒకరవుతారు. గీతాంజలిలో ఇద్దరు వ్యాధిగ్రస్తులు చనిపోదామనుకుని చివరిలో బతకాలనే ఆశతో ఉంటారు. ఇలా ఆత్మహత్యలు చేసుకోవాలనుకునే కథల్లోంచి పుట్టిన కొత్త కాన్సెప్ట్ "నేను నా రాక్షసి"
కథలోకి వెళితే.... ఇలియానా మెడకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడే ఘటనతో కథ ఆరంభమవుతంది. ఆ తర్వాత ఈమె గురించి ఫ్లాష్బ్యాక్ వస్తుందేమోనని ప్రేక్షకుడు అనుకుంటాడు. అయితే అలాక్కాదు. ఇందులో ఇలియానా ద్విపాత్రాభినయం అని తర్వాత తెలుస్తుంది. అభిరామ్ (రానా) కిరాయి గన్తో హత్యలు చేస్తుంటాడు. దీనిద్వారా వచ్చిన డబ్బును కోమాలో ఉన్న తన తల్లిని కాపాడేందుకు ఉపయోగిస్తాడు.
మరోవైపు మీనాక్షి (ఇలియానా) ఓ కాఫీబార్లో ఉద్యోగం చేస్తుంది. అభి, మీనాక్షి ఒకరికొకరు పలుసార్లు తారసపడతారు. ఈమెను చూడగానే అభికి ప్రేమ చిగురిస్తుంది. ఈమె ప్రవృత్తి మాత్రం ఆత్మహత్య చేసుకొనేవారి చివరి కోరిక ప్రకారం ఎలా చనిపోతున్నారో కెమెరాతో షూట్ చేస్తుంది. 'ఐ హేట్ మై లైఫ్' అనే పేరుతో యూ ట్యూబ్లో అవన్నీ అప్లోడ్ చేస్తుంది.
WD
సిటీలో జరిగే సంఘటనలు వెంటవెంటనే అప్లోడ్ కావడంతో పోలీసు యంత్రాంగం దృష్టిపెడుతుంది. ఓసారి తను చనిపోవాలనుకుని మీనాక్షి నడిపే యుట్యూబ్కు మెసేజ్ పంపుతాడు. ఆమె వచ్చి అభి ఆత్మహత్య చేసుకునే సన్నివేశాన్ని షూట్ చేస్తుంది. కత్తితో పొడుచుకుంటున్నప్పుడు ఆమె వేసుకున్న మాస్క్ ఊడిపోతుంది. తను ప్రేమించిన అమ్మాయే తన ఆత్మహత్యను షూట్ చేస్తుందని తెలుసుకుని రక్షించమంటాడు.
'ఇది నా పనికాదు. జరిగింది షూట్ చేయడమే నా పనంటూ' వెళ్ళిపోతుంది. ఓసీ రాక్షసి అంటూ తిడతాడు అభి. ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో మీనాక్షి యూట్యూబ్ నడుపుతుందని తెలుసుకుని ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ సందర్భంలో అభి వచ్చి రక్షిస్తాడు. మరోవైపు అభిని చంపడానికి ఓ రౌడీ వెంటాడుతుంటాడు. వీరిద్దరినుంచి తప్పించుకోవాలంటే వెనీస్కు వెళదామని విదేశాలకు వెళతారు. అక్కడ కూడా అటు పోలీసులు, ఇటు రౌడీగ్యాంగ్ వచ్చి వీరిని చంపడానికి ప్రయత్నిస్తారు.
తను ఎలాగో కొద్దిరోజుల్లో ఆత్మహత్య చేసుకుంటానని అది షూట్ చేయమని అభికి మీనాక్షి చెబుతుంది. ఇలా ఇద్దరూ చివరిలో ఆత్మహత్య చేసుకుంటారు. అయితే సినిమాలో ఏం చెప్పారు? అసలు మొదటసారి కత్తితో పొడుచుకున్న అభి ఎలా బతికాడు? ఇవి తెలుసుకోవాలంటే చిత్రం చూడండి.. ఎందుకూ ఈ గొడవ అనుకుంటే మీ ఇష్టం.
ఇటువంటి కథలు హాలీవుడ్ కల్చర్కు తగిన విధంగా ఉంటాయి. కానీ మొదటి భాగాన్ని చక్కగా ఎవరికి ఎవరు అనేది ఇంట్రస్ట్గా తెలీయకుండా చూపించి రెండో భాగాన్ని ఏకంగా వెనీస్కు తీసుకెళ్ళి తెలుగు నేటివిటీకి దూరం చేశాడు. అసలు కథే కొత్తగా ఉంది. ఇదొక ప్రయోగమని మొదటనుంచీ చెబుతున్న పూరీకి మాత్రం నిజంగానే కొత్తగా అనిపించి ఉంటుంది. కానీ సామాన్య ప్రేక్షకుడికి ఈ గొడవేంటి అనిపిస్తుంది.
WD
కథ ఎత్తుకోవడంతోనే ఇది ఆత్మహత్యల గురించి అని ప్రేక్షకుడికి చెప్పేస్తాడు. కథ తెలిసిపోవడంతో కాస్త ఉత్కంఠ కూడా పోతుంది. సెకండాఫ్లో కథలో సరైన బిగువు లేకపోవడంతో కథనం పట్టుతప్పింది. రానా, మీనాక్షి పాత్రలు తమ పాత్రల మేరకు బాగానే చేశారు. అలీ పాత్రను కేవలం ముతక మాస్ రకంగా చూపించారు. అమ్మాయి సుఖంకోసం అలీ పలికే ఫీలింగ్స్ బాగున్నా... సంభాషణలు కూడా డైరెక్ట్గా ఉండటం ఫ్యామిలీతో చూసేవారికి కడు ఇబ్బందే.
చైల్డ్ సెంటిమెంట్తో పడేయాలని చూసిన దర్శకుడు... పోలీసు అధికారి సుబ్బరాజు కుమార్తె చనిపోతే ఆమె అస్థికలు కలపడానికి వెనీస్ వస్తాడు. వెనీస్ చూడాలనేది అమ్మాయి కోరిక. అయితే పిల్లలు చనిపోతే పూడ్చిపెడతారు. కాల్చరు అనే లాజిక్ ఎందుకో దర్శకుడు మరిచాడు. ఆత్మహత్యలు చేసుకునేవారు ఎంతటి క్షోభను అనుభవిస్తారో అని ప్రజలకు తెలియజెప్పడమే తన ఉద్దేశ్యమని మీనాక్షి తను చేసే షూటింగ్ను సమర్థించుకుంటుంది. ఆత్మహత్య చేసుకున్నవారు నరకానికి పోతారు అని అంటే... ఎన్నో లోకాల్లో నరకం అనేది భూలోకమేనేమో అనే డైలాగ్ పండింది.
ఈ ఆత్మహత్యల కాన్సెప్ట్ సామాన్యుడికి ఎక్కలేదనడానికి చాలా సన్నివేశాల్లో కేకలు వేయడం,, ఇక చాలు అనడం విన్పిస్తాయి. రక్తచరిత్రలో బుక్కారెడ్డి పాత్ర వేసిన అభిమన్యు అదే తరహాలో పాత్రను పోషించాడు. కోట శ్రీనివారావు మొదటి కుమార్తె మీనాక్షి సోదరి అరెస్ట్ అయినప్పుడువ మీడియా చూపిన ఉత్సాహం, పోలీసులు చూపిన అత్యుత్సాహంతో వారి జీవితం సర్వనాశనం అవుతుంది.
అందుకు ప్రతిగా సమాజాన్ని ఏమీ చేయలేక తనే ఆత్మహత్య చేసుకుందని అందుకే తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంన్నానని మీనాక్షి చెబుతుంది. మరోవైపు... చనిపోతే వీడియోలు తీసి పబ్లిసిటీ ఇచ్చి ఊకదంపు ఉపన్యాసాలతో మీడియా ఎంత హడావుడి చేసినా తప్పులేనిదీ, తాను చనిపోయినవారిని షూట్ చేస్తే ఎందుకు తప్పవుతుందనే కొత్తపాయింట్ను దర్శకుడు తీసుకు వచ్చాడు.
అసలు వెనీస్ వెళ్లకుండానే ఇండియాలో ఎక్కడికైనా వెళితే... కాస్త నేటివిటీ అయినా కన్పించేది. వెనీస్లో ఒక ప్రాంతానికే పరిమితమై కథ అంతా అక్కడే సెకండాఫ్లో సాగుతుంది. ఫైనల్గా ఆత్మహత్యలు చేసుకునేవారు ఒక్కసారి ఆలోచిచండి అంటూ.... రాజేంద్రప్రసాద్ ఓ చిత్రంలో నీతి చెప్పాడు. పూరీ మాత్రం.. ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం చుట్టుపక్కలవారే.. అంటూ చెప్పడానికి ప్రయత్నించాడు. కాస్త గందరగోళంగా ఉన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనడం కష్టమే.