వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

ఠాగూర్

మంగళవారం, 18 మార్చి 2025 (09:42 IST)
వైకాపా అధికార ప్రతినిధి శ్యామలతో సహా 11 టీవీ, సినీ సెలెబ్రిటీలపై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరికి త్వరలోనే నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కలర్ ప్రిడక్షన్, నంబర్ ప్రిడక్షన్, క్రికెట్ ఇలా చైనా కేంద్రంగా పనిచేస్తున్న పలు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసినందుకు, చేస్తున్నందుకు వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 
 
పోలీసులు కేసు నమోదు చేసిన వారిలో బుల్లితెర యాంకర్, వైకాపా అధికార మహిళా ప్రతినిధి శ్యామల, టీవీ, సినీ సెలెబ్రిటీలు హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్ ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని, సుప్రీత, కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ యాదవ్, సుధీర్‌లు ఉన్నారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మియాపూర్‌కు చెందిన వి.వినయ్ అమీర్‌పేటలోని ఓ సంస్థలో శిక్షణ తరగతులకు హాజరవుతున్నాడు. తనతో పాటు శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు బెట్టింగ్ యాప్‌లకు బానిసలై భారీగా డబ్బు నష్టపోయినట్టు గుర్తించారు. దీంతో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారంటూ పలువురు యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
అతడి ఫిర్యాదుతో సోమవారం 11 మంది యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై గేమింగ్ చట్టంలోని సెక్షన్లు 3, 3ఏ, 4తో పాటు చట్టంలోని సెక్షన్ 66డి, బీఎన్ఎస్‌లోని సెక్షన్ 318 (4)ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరందరికీ త్వరలోనే నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. ఆ తర్వాత వారి వాంగ్మూలాన్ని బట్టి అరెస్టు చేసే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు